దిల్లీ కాలుష్యానికి 95శాతం అదే కారణం!

శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ, ఇతర పరిసర జిల్లాల్లో వాతావరణ కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం అక్రమ ఫ్యాక్టరీలు, నిర్మాణాలను అరికట్టేందుకు కేంద్రం శాస్త్రవేత్తలతో కూడిన బృందాలను రంగంలోకి దింపింది.

Published : 16 Oct 2020 02:18 IST

దిల్లీ: శీతాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ, ఇతర పరిసర జిల్లాల్లో వాతావరణ కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం దృష్టి సారించింది. ఇందుకోసం అక్రమ ఫ్యాక్టరీలు, నిర్మాణాలను అరికట్టేందుకు కేంద్రం శాస్త్రవేత్తలతో కూడిన బృందాలను రంగంలోకి దింపింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నుంచి 50 బృందాలను ఏర్పాటు చేసినట్లు కేంద్ర వాతావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ గురువారం తెలిపారు. ‘కేంద్రం ఏర్పాటు చేసిన బృందాలు అక్రమ కర్మాగారాలు, నిర్మాణాలపై దృష్టి సారిస్తాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాయి. పంట వ్యర్థాల దహనాన్ని కూడా అరికట్టడంపై చర్యలు తీసుకుంటాయి. వ్యవసాయ పనులు తుది దశకు చేరుకున్న వెంటనే పంట వ్యర్థాల దహనంపై పంజాబ్‌ ప్రభుత్వం సైతం దృష్టి సారించాలి. పంట వ్యర్థాలను కాల్చడం దిల్లీ వాతావరణంపై కేవలం 4శాతమే ప్రభావం చూపుతుంది. కానీ.. అక్రమ కర్మాగారాల నిర్వహణ, నిర్మాణాలు, వాహనాలు తదితరాల నుంచి వచ్చే కాలుష్యమే 95శాతం ఉంటోంది’ అని జావడేకర్‌ వెల్లడించారు. 

పంట వ్యర్థాల కాల్చివేత ప్రభావం దిల్లీపై స్వల్పంగానే ఉంటుందని జావడేకర్‌ చెప్పిన విషయాన్ని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యతిరేకించారు. మరి కాలుష్యం పెరగడానికి అది కారణం కాకపోతే ఇటీవల కొద్ది రోజుల ముందు బాగున్న గాలి నాణ్యత అప్పుడే ఎలా మారుతుందని ప్రశ్నించారు. ప్రతి సంవత్సరం కేంద్రం ఇలాంటి వ్యాఖ్యలే చేయడం తగదని విమర్శించారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్‌ ఉన్న నేపథ్యంలో శీతాకాలంలో కాలుష్యం స్థాయి తీవ్రత పెరిగితే శ్వాస సమస్యలు మరింత పెరుగుతాయని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా భారత్‌లో ఇప్పటి వరకు 72 లక్షల మంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. మరో 1.10లక్షల మంది మహమ్మారి కారణంగా మరణించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని