Corona: 99% వైరల్‌ లోడు తగ్గించే నాసల్‌ స్ప్రే 

కరోనా రెండో ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ టీకా కార్యక్రమాన్ని విస్తరించి, పిల్లలు, తక్కువ ముప్పు ఉన్న వర్గాలకూ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి..

Published : 29 May 2021 12:26 IST

రూపొందించిన కెనడా

వాషింగ్టన్‌: కరోనా రెండో ఉద్ధృతి ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ టీకా కార్యక్రమాన్ని విస్తరించి, పిల్లలు, తక్కువ ముప్పు ఉన్న వర్గాలకూ వ్యాక్సిన్లు ఇస్తున్నాయి. ప్రస్తుతమున్న కరోనా వైరస్‌ రకాలను ఎదుర్కొనేలా తమ డోసుల సమర్థతను పెంచేందుకు టీకా కంపెనీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే ముక్కులో వేసే నాసల్‌ స్ప్రేల రాకతో.. ఈ మహమ్మారిపై పోరు కొత్త మలుపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

కెనడాలోని ‘శానోటైజ్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ అనే సంస్థ నైట్రిక్‌ ఆక్సైడ్‌ నాసల్‌ స్ప్రే (ఎన్‌ఓఎన్‌ఎస్‌)ను తయారుచేసింది. ఇది కొవిడ్‌ బాధితుల్లో వైరల్‌ లోడును 99 శాతం మేర నిర్మూలిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ ఔషధం.. ఎగువ శ్వాసనాళాల్లోని వైరస్‌ను చంపేస్తుందని తెలిపింది. లేకుంటే ఆ వైరస్‌ తొలుత అక్కడ పాగా వేసి, ఆ తర్వాత ఊపిరితిత్తుల్లోకి విస్తరిస్తుంది. ఈ పరిస్థితిని ఎన్‌ఓఎన్‌ఎస్‌ నివారిస్తుంది. కొవిడ్‌ బారిన పడిన 79 మందిపై ఈ స్ప్రేను పరీక్షించారు. దీన్ని వాడిన 24 గంటల్లోనే 95 శాతం మేర వైరల్‌ లోడు తగ్గిపోయిందని తేల్చారు. 72 గంటల్లో 99 శాతం మేర వైరస్‌ను ఇది నిర్మూలించిందని వారు పేర్కొన్నారు. బ్రిటన్‌లో మొదట వెలుగుచూసిన కరోనా వైరస్‌ రకంపై కూడా ఇది సమర్థంగా పనిచేస్తుందని వివరించారు. దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలగలేదని పేర్కొన్నారు. ఎన్‌ఓఎన్‌ఎస్‌ వినియోగానికి ఇజ్రాయెల్, న్యూజిలాండ్‌ ఇటీవల పచ్చజెండా ఊపాయి. భారత్‌లోనూ దీన్ని ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్‌ సంస్థ సంప్రదింపులు సాగిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని