Kajol: మరోసారి కాజోల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు.. షారుఖ్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం

బాలీవుడ్‌ నటి కాజోల్‌ (Kajol) మరో వివాదంలో చిక్కుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఆమె రెండోసారి ఇలా తన వ్యాఖ్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Published : 16 Jul 2023 13:43 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి కాజోల్‌ (Kajol) తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ స్టార్‌ హీరో సినిమానుద్దేశిస్తూ ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో సదరు హీరో అభిమానులు నెట్టింట తిడుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే..

కాజోల్‌ తాజాగా నటించిన కోర్టు రూమ్‌ డ్రామా ‘ది ట్రయల్‌’ (The Trail). సుపర్ణ్‌ వర్మ దర్శకుడు. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా షారుఖ్‌ ఖాన్‌ గురించి అడగ్గా.. ‘‘ఆయనతో నాకు మంచి స్నేహం ఉంది. మళ్లీ ఒక రొమాంటిక్‌ సాంగ్‌  చేయాలని ఉంది’’ అని కాజోల్‌ అన్నారు. అనంతరం ‘ఒకవేళ ఇప్పుడు షారుఖ్‌ ఎదురైతే.. ఆయన్ని మీరు అడిగే ఒకేఒక్క విషయం ఏమిటి?’ అని ప్రశ్నించగా.. ‘‘పఠాన్‌’ (షారుఖ్‌ నటించిన రీసెంట్‌ బ్లాక్‌ బస్టర్‌) నిజమైన కలెక్షన్స్‌ ఎంతో చెప్పమంటాను’’ అని బదులిచ్చారు. ‘పఠాన్‌’ కలెక్షన్స్‌ను ఉద్దేశిస్తూ ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

రివ్యూ: ది ట్రయల్‌.. లాయర్‌గా కాజోల్‌ నటన ఆకట్టుకుందా?

షారుఖ్‌ ఇటీవల నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పఠాన్‌’ (pathaan) బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టినట్లు గతంలో ఆ చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు చేసిందని పేర్కొంది. ఈ సినిమా కలెక్షన్స్‌ను ఉద్దేశిస్తూ తాజాగా కాజోల్‌ చేసిన వ్యాఖ్యలు.. కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి. ‘పఠాన్‌’ కలెక్షన్స్‌ నిజమేనా..? కాదా? అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

నెల రోజుల వ్యవధిలోనే కాజోల్‌.. తన మాటలతో మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇటీవల రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ.. చదువుపై అవగాహన లేని నాయకులు మనల్ని పాలిస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో ఆమె వివరణ కూడా ఇచ్చారు. ఇక, షారుఖ్‌ - కాజోల్‌ పలు చిత్రాల్లో కలిసి నటించారు. ‘దిల్‌వాలే దుల్హనియా లేజాయెంగే’, ‘బాజీఘర్‌’, ‘దిల్‌ వాలే’ వంటి చిత్రాలు ఈ జంటకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు