Naga Chaitanya: సమంత ఎప్పుడూ సంతోషంగానే ఉండాలి: నాగచైతన్య

తన మాజీ భార్య సమంత (Samantha) గురించి నటుడు నాగచైతన్య (Naga Chaitanya) స్పందించారు. తాము విడాకులు తీసుకుని ఏడాది అయ్యిందని అన్నారు.

Published : 05 May 2023 17:54 IST

హైదరాబాద్‌: తన మాజీ భార్య, నటి సమంత (Samantha) మంచి మనసున్న వ్యక్తి అని నటుడు నాగచైతన్య అన్నారు. జీవితంలో ఆమె ఎప్పుడూ సంతోషంగానే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. తన తదుపరి చిత్రం ‘కస్టడీ’ (Custody) ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన సమంతతో విడాకుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టప్రకారం విడాకులు తీసుకున్నామని ఆయన మొదటిసారి వెల్లడించారు.

‘‘మేము విడిపోయి రెండేళ్లు అవుతోంది. చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతోంది. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగిపోతున్నాం. జీవితంలోని ప్రతి దశను నేను గౌరవిస్తున్నాను’’

‘‘సమంత మంచి మనిషి. ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నెట్టింట్లో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్లింది. అదే నన్ను ఎంతో బాధపెట్టింది. అలాగే, ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏమిటంటే.. నా గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యింది.’

’‘‘సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత జీవితంపై పలువురు నన్ను ప్రశ్నిస్తుంటారు. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోలేదు. అలాంటి ప్రశ్నలకు మౌనంగా ఉండేవాడిని. కాకపోతే, ఇప్పటికీ వాళ్లు నా పెళ్లి గురించే ఎందుకు మాట్లాడుతున్నారు? వదంతులు ఎందుకు సృష్టిస్తున్నారు? ఇదే నాకు అర్థం కావడం లేదు’’ అని నాగచైతన్య అన్నారు.

అనంతరం ఆయన అక్కినేని హీరోలకు వస్తోన్న వరుస ఫెయిల్యూర్స్‌పై స్పందించారు. ‘‘మేము ఎప్పుడూ విజయవంతమైన సినిమాలే చేయాలనుకుంటాం. ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలు విజయాన్ని అందుకోలేకపోయాయి. ఒక వ్యక్తి కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజం. మేము కూడా అన్నింటినీ దాటుకుంటూ ముందుకు ప్రయాణిస్తున్నాం. త్వరలోనే మేము విజయాలతో ప్రేక్షకులను అలరిస్తాం. ‘కస్టడీ’ విషయంలో నేను నమ్మకంతో ఉన్నా. ఎలాంటి సమయంలోనే అభిమానుల ప్రేమాభిమానాలు పొందుతున్నందుకు ఆనందిస్తున్నా’’ అని చై వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని