Vijayasai Reddy: విడదల రజినిపై విజయసాయిరెడ్డి ఆగ్రహం!

పల్నాడు జిల్లాలో వైకాపా నేతల పనితీరుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి సమీక్షించారు.

Updated : 24 Aug 2023 08:32 IST

గ్రూపు రాజకీయాలు చేయొద్దని మంత్రికి హితవు

నరసరావుపేట టౌన్‌, న్యూస్‌టుడే: పల్నాడు జిల్లాలో వైకాపా నేతల పనితీరుపై ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రాంతీయ సమన్వయకర్త విజయసాయిరెడ్డి సమీక్షించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో మంత్రి విడదల రజిని, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలతో బుధవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ప్రధానంగా మంత్రి రజిని ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంపై ఎక్కువ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌, జాన్‌సైదా వర్గాలను వేరు చేసి పార్టీని బలహీన పరిచారని రజినిపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలు చేయడం సరైన పద్ధతి కాదని హితవు చెప్పారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో సఖ్యతగా ఉండటంలేదని, ప్రజలను దూరం చేసుకున్నారంటూ ఐప్యాక్‌ ఇచ్చిన నివేదికపై ప్రశ్నించారు. అక్కడి పరిస్థితులపై ఇతర నేతలను ఆరా తీశారు. అయితే తనపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తున్న అసంతృప్త వర్గాలు విజయసాయిరెడ్డిని కలవనివ్వకుండా మంత్రి రజిని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. గురువారం నిర్వహించే నియోజకవర్గ ముఖ్యనేతల సమావేశంలో మంత్రి రజినితో తాడోపేడో తేల్చుకునేందుకు వారు సిద్ధమవుతున్నారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని