తెదేపా అంతర్గత సమావేశాలపైనా ‘నిఘా’
రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలంటే అసాంఘిక శక్తులే అన్న రీతిలో నిఘా విభాగం వ్యవహరిస్తోంది. ఏదైనా సభ ఏర్పాటు చేశారంటే దానిపై డేగకన్ను వేస్తోంది. సమావేశం పెట్టుకున్నారంటే చాలు వెంటనే అక్కడ వాలిపోతోంది.
ఎన్నికల వ్యూహాలు తెలుసుకుని వైకాపాకు చేరవేయడానికేనా?
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలంటే అసాంఘిక శక్తులే అన్న రీతిలో నిఘా విభాగం వ్యవహరిస్తోంది. ఏదైనా సభ ఏర్పాటు చేశారంటే దానిపై డేగకన్ను వేస్తోంది. సమావేశం పెట్టుకున్నారంటే చాలు వెంటనే అక్కడ వాలిపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక అయినా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఈ విభాగం.. ఇప్పటికీ అధికారపార్టీ జేబు సంస్థగా పనిచేస్తోంది. చివరకు ఎన్నికల వ్యూహాలను నిర్ణయించుకునేందుకు ఏర్పాటు చేసుకునే అంతర్గత సమావేశాలనూ వదలడం లేదు. శనివారం విజయవాడలో తెదేపా తరఫున లోక్సభ, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసేందుకు తెదేపా ఏర్పాటు చేసిన కార్యశాలలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేన, భాజపా నేతలు మాట్లాడారు. ప్రారంభోపన్యాసం అనంతరం అభ్యర్థులు, వారి మేనేజర్లు తప్పితే మరెవరూ అక్కడ ఉండొద్దని, అందరూ బయటకు వెళ్లిపోవాలని స్పష్టంగా చెప్పారు. దీంతో పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో పాటు ఇతర తెదేపా నేతలు, వారి అనుచరులు కూడా బయటకొచ్చారు. సమావేశం కొనసాగుతున్న సమయంలో ఒకరు వీడియో తీస్తుండటాన్ని గమనించిన తెదేపా నేతలు.. అతడిని ప్రశ్నించగా తెదేపా కార్యకర్తనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. గట్టిగా నిలదీయడంతో తాను నిఘా విభాగం పోలీసునని చెప్పారు. ఆయన ఫోన్పై వైకాపా బొమ్మ ఉండటం గమనార్హం.
వారికి ఇక్కడ ఏం పని?
కార్యశాలకు హాజరైన వారంతా ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులే. సంఘ విద్రోహ శక్తులు కాదు. పైగా వారు పాల్గొన్నది ఓ అంతర్గత సమావేశం. మరి అక్కడ నిఘావిభాగానికి ఏం పని అని తెదేపా వర్గాలు నిలదీస్తున్నాయి. తమ ఎన్నికల వ్యూహం ఏమిటో తెలుసుకుని వైకాపా పెద్దలకు చేరవేయడమే వీటి వెనక ఉద్దేశమని ఆరోపిస్తున్నాయి. 2021 అక్టోబరులో మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంపై వైకాపా శ్రేణులు దాడి చేశాయి. అద్దాలు ధ్వంసం చేసి, అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడ్డాయి. ఆ సందర్భంగా ఒక వ్యక్తి దారి తెలియక గదిలో దాక్కోగా.. ఆయనను తాము పట్టుకున్నామని, తాను డీజీపీ ఆఫీసులో పనిచేసే పోలీసుగా చెప్పాడని తెదేపా నేతలు పేర్కొన్నారు. ‘ఒక పోలీసుకు వైకాపా శ్రేణుల వెంట తెదేపా కార్యాలయంలోకి వెళ్లాల్సిన పని ఏముంది? వైకాపా వారు అక(్కడ ఎంతమందిని చితకబాదారు, విధ్వంసం ఎలా చేశారనేది చిత్రీకరించి పెద్దలకు పంపిస్తారా?’ అని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రశ్నించారు. పైగా పట్టుబడిన వ్యక్తే.. తనపై తెదేపా నేతలు దాడి చేశారంటూ ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం గమనార్హం. ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టించేందుకు ఇలాంటి సమావేశాలకు కావాలనే ఎస్సీ, ఎస్టీ వర్గాల సిబ్బందిని పంపిస్తున్నారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.
ఆ దరిదాపుల్లోకి వెళ్లే ధైర్యం ఉందా?
రాష్ట్రస్థాయిలోనే కాదు, జిల్లాల్లో అయినా, నియోజకవర్గాల్లో అయినా ప్రతిపక్ష నేతల కార్యకలాపాలపై డేగకన్ను పెట్టడమే తమ పని అన్నట్లుగా నిఘా విభాగం తయారైంది. వైకాపా నేతలు కూడా ఎక్కడికక్కడే సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. నిఘా విభాగం పోలీసులు కనీసం అక్కడకు వెళ్లే ధైర్యమూ చేయరని తెదేపా నేతలు పేర్కొంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్వహించే విలేకరుల సమావేశాలకు కూడా నిఘా విభాగానికి చెందిన వారు వీడియోలు తీసేందుకు హాజరవుతున్నారు. పదుల సంఖ్యలో మీడియా ప్రతినిధులు ఉండటంతో.. వారిని ప్రత్యేకంగా గుర్తించే అవకాశం ఉండదు. ఎవరైనా గుర్తించి అడిగినా ఏదో ఒక మీడియా పేరు చెప్పి బయటపడుతున్నారు. గట్టిగా నిలదీస్తే తాము పోలీసు విభాగమని చెబుతున్నారు.
ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటేనే
ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక ప్రభుత్వ శాఖలు నిష్పక్షపాతంగా పనిచేయాలి. నిఘా విభాగం మాత్రం ఇప్పటికీ అధికారపార్టీకి అనుబంధ శాఖగానే పనిచేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్పై ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేయించాలని ఇప్పటికే ఎన్నికల సంఘానికి తెదేపా నాయకులు వినతిపత్రాలు అందజేశారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నిఘా విభాగాన్ని ప్రక్షాళన చేస్తే తప్ప స్వేచ్ఛగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదన్న వాదన వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇతర నేతల అంతమే మోదీ లక్ష్యం
తిహాడ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రధాని మోదీతో చర్చకు సిద్ధమే
లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నేతలతో బహిరంగ చర్చ నిర్వహించాలన్న విశ్రాంత న్యాయమూర్తుల చొరవను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసించారు. -
విపక్ష నేతలకు రాసిన లేఖపై మీరు స్పందించడం ఆశ్చర్యమే
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు విడతల్లో నమోదైన పోలింగ్ శాతాల వెల్లడిలో జాప్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలకు తాను రాసిన లేఖపై ఎన్నికల సంఘం (ఈసీ) స్పందించడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. -
కేజ్రీవాల్, సిసోదియా వంటి వారిని భాజపా ఆహ్వానించదు
తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, సత్యేంద్ర జైన్ వంటి నేతలను భాజపాలోకి ఎప్పటికీ ఆహ్వానించబోమని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకుర్ స్పష్టం చేశారు. -
వరుణ్కు టికెట్ ఇస్తే బాగుండేది: మేనకా గాంధీ
యూపీలోని పీలీభీత్ లోక్సభ స్థానం నుంచి మరోసారి పోటీ చేసేందుకు తన కుమారుడు వరుణ్ గాంధీకి భాజపా అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని ఆయన తల్లి మేనకా గాంధీ పేర్కొన్నారు. -
పోలింగ్ ముగియగానే విలేకర్ల సమావేశం నిర్వహించండి
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతి విడత పోలింగ్ ముగిశాక అదే రోజు విలేకర్ల సమావేశం నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ప్రెస్ అసోసియేషన్ తదితర మీడియా సంఘాలు డిమాండ్ చేశాయి. -
‘టెంపో’ బిలియనీర్ల తోలుబొమ్మ మోదీ
‘టెంపో బిలియనీర్ల’ చేతిలో తోలుబొమ్మలాంటి 21వ శతాబ్దపు రాజు ప్రధాని నరేంద్రమోదీ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు.