Rishabh Pant: భవిష్యత్‌లో దిల్లీకి ఆడతాడు.. రికీ పాంటింగ్‌ కుమారుడిపై పంత్‌

ఇప్పటి వరకు ఈ సీజన్‌లో అత్యంత పేలవమైన ఆటతీరును ప్రదర్శిస్తున్న జట్టు దిల్లీ క్యాపిటల్స్‌. పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచేందుకు ఇబ్బంది పడుతోంది.

Published : 16 Apr 2023 15:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 16వ సీజన్‌లో (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్ (DC) వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయినప్పటికీ.. ఓ బుడతడు మాత్రం నెట్టింట్లో వైరల్‌గా మారాడు. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న వీడియో హల్‌చల్‌ చేస్తోంది. ఇంతకీ ఎవరనేగా మీ అనుమానం..? అతడు దిల్లీ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ కుమారుడు ఫ్లెచర్ విలియమ్స్ పాంటింగ్. బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్న కుమారుడిని ఉద్దేశించి ‘సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటావా..?’ అని రికీ అడుగుతాడు. ఆ వీడియోను దిల్లీ క్యాపిటల్స్‌ తన సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. దీనిపై తాజాగా దిల్లీ మాజీ కెప్టెన్‌, టీమ్‌ఇండియా ఆటగాడు రిషభ్‌ పంత్ ప్రత్యేకంగా స్పందించాడు. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆర్‌సీబీ - దిల్లీ మ్యాచ్‌ను వీక్షించేందుకు పంత్ బెంగళూరు కూడా వెళ్లాడు. 

‘‘ఎంపిక చేసుకొనేందుకు అతడికి తగినంత వయసు లేదు రిక్‌. అయితే, భవిష్యత్తులో తప్పకుండా దిల్లీ కోసం ఆడతాడు’’ అని పంత్‌ ప్రతిస్పందించాడు. దీనిని దిల్లీ క్యాపిటల్స్ తన ట్విటర్‌లో పోస్టు చేసింది. డేవిడ్‌ వార్నర్ నాయకత్వంలోని దిల్లీ ఇప్పటి వరకు పాయింట్ల ఖాతాను తెరవలేదు. తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 20న కోల్‌కతాతో దిల్లీ తలపడనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని