Shreyas Iyer: గాయం పెద్దదే..

Eenadu icon
By Sports News Desk Published : 28 Oct 2025 03:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఐసీయూలో శ్రేయస్‌కు చికిత్స 
కోలుకుంటున్న క్రికెటర్‌
దిల్లీ

టీమ్‌ఇండియా వన్డే వైస్‌కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు అనుకున్నదానికంటే పెద్ద గాయమే అయ్యింది. పక్కటెముకల గాయం కారణంగా అంతర్గత రక్తస్రావం కావడంతో రెండు రోజులు అతడికి ఆసుపత్రిలో అత్యవసర విభాగం (ఐసీయూ)లో చికిత్స అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆస్ట్రేలియాతో మూడో వన్డే సందర్భంగా క్యాచ్‌ అందుకునే క్రమంలో శ్రేయస్‌ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ముందు అనుకున్నట్లు మూడు వారాలు కాక, మరింత కాలం అతడు ఆటకు దూరం కావచ్చు. 

స్పృహ తప్పడంతో..: గాయంతో మైదానాన్ని వీడాక డ్రెస్సింగ్‌రూమ్‌లో శ్రేయస్‌ స్పృహ తప్పి పడిపోయినట్లు తెలుస్తోంది. వెంటనే అతణ్ని ఆసుపత్రిలో చేర్చగా.. ప్లీహానికి గాయమైనట్లు స్కాన్స్‌తో తేలింది. క్యాచ్‌ అందుకునే క్రమంలో అతడు బలంగా నేలపై పడటంతో తీవ్రమైన గాయమైంది. ‘‘శ్రేయస్‌కు పక్కటెముకల దిగువ భాగంలో గాయమైంది. తదుపరి పరీక్షల కోసం అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాం. అతడి ప్లీహానికి చీలిక వచ్చినట్లు స్కాన్స్‌లో తేలింది’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘బీసీసీఐ వైద్య సిబ్బంది.. సిడ్నీ, భారత్‌లో స్పెషలిస్ట్‌లను సంప్రదిస్తూ శ్రేయస్‌ చికిత్సను పర్యవేక్షిస్తోంది. భారత జట్టు వైద్యుడు శ్రేయస్‌తో పాటు సిడ్నీలోనే ఉంటాడు’’ అని చెప్పింది. 30 ఏళ్ల శ్రేయస్‌ ఏడు రోజుల వరకు ఆసుపత్రిలో పరిశీలనలో ఉండొచ్చు.

‘‘శ్రేయస్‌ గత రెండు రోజులు ఐసీయూలో ఉన్నాడు. అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు పరీక్షల్లో తేలడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సివచ్చింది. రక్తస్రావం వల్ల  ఇన్‌ఫెక్షన్‌ వ్యాప్తి చెందకుండా ఆపాల్సివుంటుంది’’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు. డ్రెస్సింగ్‌రూమ్‌కు వచ్చిన అనంతరం శ్రేయస్‌ కీలక పరామితులు ప్రమాదకర స్థాయిలో తక్కువగా ఉండడంతో వెంటనే అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. శ్రేయస్‌ పూర్తిగా కోలుకునేందుకు కనీసం 6 నుంచి 8 వారాలు పట్టొచ్చు. శ్రేయస్‌ తల్లిదండ్రులను ఆస్ట్రేలియాకు పంపేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని