Shikhar Dhawan: గబ్బర్‌ ఆట ఇక గతమేనా.. మళ్లీ జట్టులో చూస్తామా?

తాజాగా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత వన్డే జట్టులో శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan)కు చోటు దక్కకపోవడంతో ఇక అతని ఆట గతమేనా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. 

Published : 22 Aug 2023 15:29 IST

ఐసీసీ టోర్నీల్లో తిరుగులేని రికార్డు.. ఎడమ చేతి వాటం బ్యాటింగ్‌తో అద్భుతమైన షాట్లు.. క్యాచ్‌ పట్టగానే మైదానంలో తొడగొట్టడం.. ఇలా చెప్పగానే గుర్తుకొచ్చే బ్యాటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan). కానీ ఈ సీనియర్‌ భారత బ్యాటర్‌ కెరీర్‌ ముగిసే దిశగా సాగుతుందా? అతణ్ని ఇక టీమ్‌ఇండియా జెర్సీలో చూడడం కష్టమేనా? క్రికెట్‌ వర్గాల్లో గబ్బర్‌ అని పిలుచుకునే ఇక అతని ఆట గతమేనా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా ఆసియా కప్‌కు ఎంపిక చేసిన భారత వన్డే జట్టులో ధావన్‌కు చోటు దక్కకపోవడమే అందుకు కారణం. ఈ ఆసియా కప్‌లో ఆడే భారత జట్టు నుంచే ఈ ఏడాది ప్రపంచకప్‌నకు జట్టును ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో 37 ఏళ్ల ధావన్‌ తిరిగి జట్టులోకి రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అరంగేట్రమే అదుర్స్‌..

అంతర్జాతీయ క్రికెట్లో ధావన్‌ అరంగేట్రమే అదుర్స్‌ అని చెప్పాలి. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో. 2010లో విశాఖపట్నంలో ఆస్ట్రేలియాతో వన్డేల్లో.. 2011లో టీ20ల్లో, 2013లో టెస్టుల్లో అడుగులు వేశాడు. 2013లో మొహాలీలో ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో అత్యంత వేగవంతమైన టెస్టు శతకం చేసిన అరంగేట్ర ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర టెస్టులో అత్యధిక పరుగులు (187) చేసిన భారత ఆటగాడిగానూ నిలిచాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో వన్డే శతకాలు సాధించాడు. కానీ ఇటీవల ప్రదర్శన పడిపోవడంతో పరుగుల వేటలో విఫలమవుతున్నాడు. ఇప్పుడేమో 13 ఏళ్ల అంతర్జాతీయ ప్రస్థానాన్ని ముగించే స్థితికి చేరుకున్నట్లే కనిపిస్తున్నాడు. ధావన్‌ టెస్టుల్లో నిలదొక్కుకోలేకపోయాడు. 2018లోనే చివరి టెస్టు ఆడేశాడు. ఇక 2021లో చివరగా టీ20 మ్యాచ్‌ ఆడాడు. నిరుడు డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో ఆడినప్పటికీ మునుపటి లయ అందుకోలేకపోయాడు. పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. భారత్‌కు ఆడిన గత 10 వన్డే ఇన్నింగ్స్‌లో ఆరుసార్లు రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్‌ కెప్టెన్‌గా 11 మ్యాచ్‌ల్లో 373 పరుగులతో చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేసినా జట్టులోకి రాలేకపోయాడు. గాయాలు, కుటుంబ సమస్యలు అతణ్ని వెనక్కి లాగాయి. 

ఐసీసీ టోర్నీల హీరో..

ఐసీసీ టోర్నీలు అంటే చాలు ధావన్‌ చెలరేగిపోతాడు. 2004 అండర్‌-19 ప్రపంచకప్‌తోనే అతని జోరు మొదలైంది. ఆ టోర్నీలో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. కానీ సెహ్వాగ్, గంభీర్‌ ఉండటంతో అరంగేట్రం కోసం ధావన్‌ చాలా కాలం ఎదురు చూడాల్సి వచ్చింది. ఒక్కసారి జట్టులోకి వచ్చాక సత్తాచాటాడు. ముఖ్యంగా 2013, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో అతని ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నాలుగు టోర్నీల్లో కలిపి 20 మ్యాచ్‌ల్లో 65.15 సగటుతో 1238 పరుగులు సాధించాడు. ప్రపంచకప్‌లలో 10 మ్యాచ్‌ల్లో 537 పరుగులు, ఛాంపియన్స్‌ ట్రోఫీలో 10 మ్యాచ్‌ల్లో 701 పరుగులు చేశాడు. మరోసారి వన్డే ప్రపంచకప్‌ కోసం సిద్ధమవుతున్న తరుణంలో సెలక్టర్లు అతనికి షాక్‌ ఇచ్చారు. 

తీవ్రమైన పోటీ.. 

టీమ్‌ఇండియాలో చోటు కోసం ఇప్పుడు తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ధావన్‌ను జట్టులోకి తీసుకునే పరిస్థితి లేదు. ఓపెనర్లుగా రోహిత్, శుభ్‌మన్‌ కొనసాగుతున్నారు. వీళ్లకు ప్రత్యామ్నాయంగా ఇషాన్‌ కిషన్‌ ఉన్నాడు. దీంతో జట్టులో ధావన్‌కు చోటే లేకుండా పోయింది. టీ20ల్లో ఎలాగో కుర్రాళ్లకు బీసీసీఐ పెద్ద పీట వేస్తోంది. దీంతో వన్డేల్లోకి తిరిగి రావాలనుకున్న ధావన్‌కు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ఆసియా క్రీడల్లో పోటీపడే ద్వితీయ శ్రేణి జట్టులోనూ ధావన్‌కు చోటు దక్కలేదు. దీంతో ధావన్‌ను పరిగణించడం లేదనే విషయం అర్థమైంది. ఇప్పుడు ఆసియా కప్‌ జట్టులోనూ అతణ్ని విస్మరించారు. తిరిగి జట్టులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తానని ధావన్‌ చెప్తున్నప్పటికీ అది సాధ్యమయ్యే పరిస్థితులు లేవనే చెప్పాలి. ధావన్‌ 167 వన్డేల్లో 44.11 సగటుతో 6793 పరుగులు, 34 టెస్టుల్లో 40.61 సగటుతో 2315 పరుగులు, 68 టీ20ల్లో 1759 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 24 శతకాలు అందుకున్నాడు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని