Trump: అమెరికా ఒక విఫల దేశం.. నావల్నీ మృతిపై తొలిసారి స్పందించిన ట్రంప్‌

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మృతిపై ట్రంప్‌ తొలిసారి స్పందించారు. అమెరికా ఒక విఫలదేశమని, రోజురోజుకీ క్షీణిస్తోందన్నారు. 

Updated : 20 Feb 2024 05:27 IST

వాషింగ్టన్‌: ఒక దేశంగా అమెరికా రోజురోజుకు క్షీణిస్తోందని, ఒక విఫల దేశమని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వ్యాఖ్యానించారు. రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) జైల్లో మృతి చెందిన 72 గంటల తర్వాత తొలిసారి స్పందించిన ట్రంప్‌.. అమెరికా (USA)లో తానూ బాధితుడిగా మిగిలిపోయానని పేర్కొన్నారు. నావల్నీ మృతికి, తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడి పెడుతూ మాట్లాడారు. అమెరికాలో అసలు ఏం జరగుతోందని ప్రశ్నించారు. తన సామాజిక మాధ్యమంలో ట్రంప్‌ (Trump) ఈ మేరకు పోస్టు చేశారు. అయితే ఈ పోస్టులో పుతిన్‌ పేరును ఆయన నేరుగా ఎత్తకపోవడం గమనార్హం. 

‘‘అలెక్సీ నావల్నీ ఆకస్మిక మృతి ఘటనతో మన దేశంలో ఏం జరుగుతుందో నాకు అవగాహన కలిగింది. నిజాయితీ లేని, రాడికల్‌ లెఫ్ట్‌ రాజకీయ నాయకులు, ప్రాసిక్యూటర్లు, న్యాయమూర్తులు నెమ్మదిగా మనల్ని వినాశనం వైపు తీసుకెళ్తున్నారు. తెరిచిన సరిహద్దులు, ఎన్నికల రిగ్గింగ్‌, అన్యాయపూరితమైన కోర్టుల నిర్ణయాలు అమెరికాను నాశనం చేస్తున్నాయి. మనది క్షీణిస్తున్న దేశం. మనది విఫలమైన దేశం’’ అంటూ ట్రంప్‌ పోస్టులో పేర్కొన్నారు.    

రెండో సారి అమెరికా పీఠం ఎక్కాలని ఆశపడుతున్న ట్రంప్‌ గత కొన్నేళ్ల నుంచి న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పలు కేసుల్లో నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇటీవలే న్యూయార్క్‌ కోర్టు భారీ జరిమానా విధించింది. పలు బ్యాంకులను మోసం చేసి రుణాలు తీసుకున్న కేసులో 355 మిలియన్‌ డాలర్లు (భారత కరెన్సీలో రూ.3వేల కోట్లకు పైగా) పెనాల్టీ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. 

ఇక తాజాగా ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు. ‘‘హంతక దుండగుడిగా వ్లాదిమిర్‌ పుతిన్‌ చర్యలను ఖండించాలి. లేదంటే అలెక్సీ నావల్నీ ధైర్యాన్ని పొగడాలి. అది కాకుండా అమెరికాను తక్కువ చేస్తూ.. మన దేశాన్ని రష్యాతో పోలుస్తున్నారు’’ అని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ విమర్శించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని