గుండెకు పొట్టు బలం!
అధిక బరువు, వూబకాయం.. రెండూ శరీరం మీద తీవ్ర భారం మోపేవే. ఇవి రకరకాల సమస్యలనూ వెంట బెట్టుకు వస్తాయి. గుండెజబ్బులు, పక్షవాతం...
గుండెకు పొట్టు బలం!
అధిక బరువు, వూబకాయం.. రెండూ శరీరం మీద తీవ్ర భారం మోపేవే. ఇవి రకరకాల సమస్యలనూ వెంట బెట్టుకు వస్తాయి. గుండెజబ్బులు, పక్షవాతం వంటివి కొందరిలో ప్రాణాంతకంగానూ పరిణమించొచ్చు. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, కొవ్వు పదార్థాలు తగ్గించటం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవటం మంచిదని నిపుణులు చాలాకాలంగా సూచిస్తూనే ఉన్నారు. వీటికి తోడు పొట్టు తీయని ధాన్యాలనూ ఆహారంలో చేర్చుకోవటం మంచిదని క్లీవ్లాండ్ క్లినిక్ పరిశోధకులు చెబుతున్నారు. వీటితో గుండెజబ్బు ముప్పు తగ్గుతుండటమే దీనికి కారణం.
పొట్టు తీయని ధాన్యాలకూ గుండె ఆరోగ్యానికీ సంబంధమేంటి? ఇవి రక్తపోటు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుండటమే. ముఖ్యంగా 50 ఏళ్ల లోపువారిలో మరింత మెరుగైన ప్రభావం చూపిస్తుండటం విశేషం. పాలిష్ పట్టిన, పొట్టుతీసిన ధాన్యాలను తీసుకున్నవారితో పోలిస్తే.. పొట్టుతీయని ధాన్యాలను తీసుకున్నవారిలో డయాస్టాలిక్ రక్తపోటు మూడు రెట్లు ఎక్కువగా మెరుగుపడుతున్నట్టు తాజాగా బయటపడింది. సాధారణంగా రక్తపోటును సిస్టాలిక్ (పై సంఖ్య), డయాస్టాలిక్ (కింది సంఖ్య).. ఇలా రెండు సంఖ్యలతో సూచిస్తారు. గుండె కొట్టుకున్నప్పుడు రక్తనాళాల లోపలుండే పీడనాన్ని సిస్టాలిక్ అని.. లబ్డబ్మని కొట్టుకోవటానికి మధ్యలో గుండె కండరం విశ్రాంతి తీసుకునే సమయంలో రక్తనాళాల లోపలుండే పీడనాన్ని డయాస్టాలిక్ అనీ అంటారు. 50 ఏళ్ల లోపు వారిలో డయాస్టాలిక్ రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉండటం వల్ల గుండెజబ్బు సంబంధ మరణం ముప్పూ పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో పొట్టుతీయని ధాన్యాల ప్రభావంపై క్లీవ్లాండ్ క్లినిక్ పరిశోధకులు అధ్యయనం చేశారు. వీటితో గుండెజబ్బు మూలంగా సంభవించే మరణం ముప్పు సుమారు మూడింట ఒకవంతు, పక్షవాతంతో తలెత్తే మరణం ముప్పు ఐదింట రెండొంతుల వరకు తగ్గుతున్నట్టు తేలింది. దీనికి ప్రధాన కారణం పొట్టుతీయని ధాన్యాలతో రక్తపోటు తగ్గుతుండటమే! అంతేకాదు.. వీటితో బరువు, కొలెస్ట్రాల్ కూడా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. ముఖ్యంగా గుండెకు హాని చేసే చెడ్డ కొవ్వు స్థాయులు తగ్గటానికి ఇవి ఎంతగానో దోహదపడుతున్నాయి. అందువల్ల ఆహారంలో పొట్టుతీయని ధాన్యాలను చేర్చుకోవటం మంచిదని.. రోజుకు కనీసం 50 గ్రాముల పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్