CBSE exams: ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!

ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్‌ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్‌ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.

Published : 27 Apr 2024 00:04 IST

దిల్లీ: సీబీఎస్‌ఈ(CBSE) టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త విధానాన్ని అమలుచేసేలా వ్యూహరచన చేయాలని సీబీఎస్‌ఈని కోరినట్లు తెలుస్తోంది. అయితే, ఈ పరీక్షల్లో సెమిస్టర్‌ విధానాన్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదని సమాచారం. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలను నిర్వహించే అంశంపై పాఠశాలల ప్రిన్సిపాళ్లతో వచ్చే నెలలోనే సంప్రదింపులు జరపనున్నారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ అడ్మిషన్ల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం లేకుండా రెండోసారి బోర్డు పరీక్షలు నిర్వహించేలా అకడమిక్‌ క్యాలెండర్‌ను సిద్ధం చేసేందుకు విధివిధానాలు రూపొందించే పనిలో సీబీఎస్‌ఈ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం.

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (NCF) ముసాయిదా కమిటీ సూచించింది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కె.కస్తూరిరంగన్‌ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్‌ విధానాన్ని కూడా ప్రతిపాదించింది. ఈ ఫ్రేమ్‌వర్క్‌ను గతేడాది ఆగస్టులో కేంద్ర విద్యామంత్రిత్వశాఖ విడుదల చేసింది.

యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల.. ‘సివిల్స్‌’ పరీక్షలు ఎప్పుడంటే?

ఈ అంశంపై గతేడాది అక్టోబర్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరుకావడం విద్యార్థులకు తప్పనిసరేం కాదన్నారు. ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశ పరీక్ష జేఈఈ మాదిరిగానే విద్యార్థులు ఏడాదికి రెండుసార్లు (10, 12వ తరగతి) పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని,  తద్వారా విద్యార్థులు తాము సాధించిన ఉత్తమ స్కోరును ఎంచుకోవచ్చన్నారు. కానీ, ఇది పూర్తిగా ఐచ్ఛికమే తప్ప తప్పనిసరేం కాదని స్పష్టంచేశారు. అయితే, బోర్డు పరీక్షలను సంస్కరించడం ఇదే తొలిసారేమీ కాదు.  2009లో పదో తరగతికి సీసీఈ (కంటిన్యూస్‌, కాంప్రెహెన్సివ్‌ ఎవల్యూషన్‌) విధానాన్ని ప్రవేశపెట్టారు. 2017లో దీన్ని ఎత్తేసి, మళ్లీ పాత విధానాన్నే అమలుచేశారు. కొవిడ్‌ సమయంలోనూ 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించి.. తిరిగి పాత పద్ధతినే కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని