గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పారిశుద్ధ్య పనులకు మొబైల్‌ బృందాలు
తాగునీటికి ఇబ్బందుల్లేకుండా చర్యలు
రహదారుల పునరుద్ధరణకు తక్షణ ఏర్పాట్లు
అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశం

ఈనాడు, అమరావతి: తుపాను ప్రభావిత గ్రామాల్లో సూపర్‌ క్లోరినేషన్, శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టి పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులను ఆదేశించారు. పాడైన రహదారులకు ప్రాధాన్య క్రమంలో మరమ్మతులు చేయాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు యుద్ధప్రాతిపదికన పని చేయాలని అన్నారు. మొంథా తుపాను అనంతరం గ్రామాల్లో తీసుకోవలసిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, ఇంజినీరింగ్‌ విభాగాల అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ తుపానును 1,583 గ్రామాలు ప్రభావితమైనట్లుగా అధికారులు వివరించారు. పారిశుద్ధ్య సిబ్బందిని పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచామని వివరించారు. 38 చోట్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, మరో 125 చోట్ల రహదారులకు గుంతలు పడ్డాయని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రక్షిత తాగునీటి పథకాల ట్యాంకుల వద్ద క్లోరినేషన్‌ చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. 

తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి

‘తాగునీటి పథకాల ద్వారా నీటి సరఫరాకు ఇబ్బందులు ఉంటే తక్షణమే ప్రత్యామ్నాయం చూడాలి. గ్రామాల్లో 21,055 మంది కార్మికులతో మొబైల్‌ శానిటేషన్‌ బృందాలు సిద్ధం చేసి పారిశుద్ధ్యం మెరుగయ్యేలా చూడాలి.  తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య ఆరోగ్యశాఖతో సమన్వయం చేసుకుని వ్యాధులు ప్రబలకుండా చూడాలి. గ్రామాల్లో మళ్లీ సాధారణ పరిస్థితి వచ్చే వరకు పూర్తిగా దృష్టి సారించాలి.  

జిల్లా పరిషత్‌ సీఈవోలు, ఛైర్మన్లు, డీపీవోలు తదితర అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండి గ్రామాల్లో పరిస్థితిని చక్కదిద్దాలి. ప్రతి జిల్లాలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి సమన్వయం చేసుకోవాలి’ అని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.

అత్యవసర బృందాలతో ప్రజలకు సేవలు అందించాలి

‘రాష్ట్ర వ్యాప్తంగా 1,158 మొబైల్‌ శానిటేషన్‌ బృందాలు ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులు మొదలు పెట్టాలి. తుపానుతో దెబ్బతిన్న 779 రోడ్లు, 89 వంతెనలు, 473 కల్వర్టుల పునరుద్ధరణకు తక్షణమే చర్యలు చేపట్టాలి. పాక్షికంగా ధ్వంసమైన రోడ్లు, వంతెనలను జిల్లా స్థాయి నిధులతో రిపేర్లు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి’ అని అధికారులను పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు.


తుపాను బలహీనపడ్డా పునరావాస కేంద్రాల్లోనే ఉంచాలి

‘తుపాను బలహీనపడ్డా పునరావాస కేంద్రాల్లో ఉన్న వారిని బుధవారం కూడా అక్కడే ఉంచాలి. తీవ్ర గాలులు, వర్షం ఉన్నందున వారిని ఇళ్లకు పంపడం సరికాదు’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులకు సూచించారు. మంగళవారం అర్ధరాత్రి తుపాను తీరం దాటిన నేపథ్యంలో రాత్రంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లా కలెక్టర్ల పేషీ నుంచి సమాచారం తెలుసుకుని ఉప ముఖ్యమంత్రి సూచనలు, సలహాలు వారికి అందజేశామని ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని