Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్‌.. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌!

Credit Cards: క్రెడిట్‌ కార్డుల విషయంలో ఏప్రిల్‌ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి.

Published : 21 Mar 2024 15:26 IST

Credit Cards Changes From April 1st | ఇంటర్నెట్‌డెస్క్‌: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే! కొత్త ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్‌ కార్డు విషయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఎస్‌బీఐ (SBI), ఐసీఐసీఐ బ్యాంక్‌ (ICICI Bank), యాక్సిస్‌ బ్యాంక్‌ (Axis Bank), ఎస్‌ బ్యాంక్‌ (YES Bank).. వంటి ప్రధాన బ్యాంకులు లాంజ్‌ యాక్సెస్‌, రివార్డ్‌ పాయింట్ల విషయంలో కీలక మార్పులు తీసుకొస్తున్నాయి. ఆ మార్పులివీ..

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ రివార్డ్‌ పాయింట్ల విధానాల్లో మార్పు చేసింది. ఇప్పటివరకు అద్దె చెల్లింపులపై రివార్డ్‌ పాయింట్లను అందిస్తున్న బ్యాంక్‌.. ఇకపై ఆ తరహా రివార్డులను నిలిపివేయనుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఈ నిబంధనలు వర్తించనున్నాయి. ఎస్‌బీఐ అందిస్తున్న AURUM, SBI కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్‌ ఎస్‌బీఐ కార్డులు వినియోగిస్తున్న వారిపై ఈ ప్రభావం ఉండనుంది.

ఐసీఐసీఐ బ్యాంక్‌

కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో నిబంధనల్ని ఐసీఐసీఐ బ్యాంక్ సవరించింది. రానున్న త్రైమాసికంలో ఈ సదుపాయం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.35,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కోరల్‌ క్రెడిట్‌ కార్డ్‌, మేక్‌ మై ట్రిప్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌ ప్లాటినం క్రెడిట్‌ కార్డ్‌ సహా వివిధ రకాల కార్డులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఈ మార్పులు కూడా కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి. 

మెదడులో చిప్‌తో వీడియో గేమ్‌ ఆడిన పక్షవాత బాధితుడు

యస్‌ బ్యాంక్‌

ఐసీఐసీఐ బ్యాంక్‌ తరహానే యస్‌ బ్యాంక్‌ కూడా లాంజ్‌ యాక్సెస్‌లో నిబంధనల్ని సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఏ త్రైమాసికంలో లాంజ్‌ సదుపాయం పొందాలన్నా అంతకు మునుపటి త్రైమాసికంలో కార్డ్‌ ద్వారా కనీసం రూ.10,000 వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొంది.

యాక్సిస్‌ బ్యాంక్‌ 

ప్రైవేటు రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ అందిస్తున్న మాగ్నస్‌ క్రెడిట్‌ కార్డ్‌పై రివార్డ్‌ పాయింట్లు, లాంజ్‌ యాక్సెస్‌తో పాటు వార్షిక రుసుముల్లో కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. బీమా, గోల్డ్‌/ఆభరణాలు, ఇంధనం కోసం క్రెడిట్‌ కార్డ్‌ ద్వారా జరిపే చెల్లింపులపై ఇక నుంచి ఎలాంటి రివార్డ్‌ పాయింట్లూ ఇవ్వబోమని స్పష్టంచేసింది. ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌ పొందాలంటే మూడు నెలల్లో కనీసం రూ.50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో దేశీయ, అంతర్జాతీయ లాంజ్‌ల్లోకి కాంప్లిమెంటరీ గెస్ట్‌ సందర్శనల సంఖ్యను కూడా ఏడాదికి 8 నుంచి 4కు తగ్గించనుంది. ఏప్రిల్‌ 20 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని బ్యాంక్‌ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని