Sangareddy: సంగారెడ్డిలో 635 కిలోల గంజాయి సీజ్‌!

సంగారెడ్డి రూరల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో  635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ తెలిపారు.

Published : 25 Nov 2023 15:29 IST

సంగారెడ్డి: సంగారెడ్డి రూరల్‌ పోలీస్టేషన్‌ పరిధిలో నిర్వహించిన వాహన తనిఖీల్లో  635 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ తెలిపారు. దీని విలువ దాదాపు రూ. 3 కోట్ల వరకు ఉండొచ్చని ఆయన చెప్పారు. రెండు బొలెరో వాహనాలను సీజ్‌ చేసి.. ఇద్దరు డ్రైవర్లు, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మీడియాకు వివరించారు. బొలెరో వాహనాల కింది భాగంలో బాక్సు లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు ముగ్గురూ.. మహారాష్ట్రకు చెందిన తమ యజమాలు హనుమాన్ మోహిత్, సమీర్ గవండేల ఆదేశం మేరకు ఒడిశాలోని జన్ భాయ్ ఏజెన్సీ ప్రాంతంలో ఉండే త్రినాథ్ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు రవాణా చేస్తున్నట్లు వివరించారు. టాస్క్ ఫోర్స్ అధికారుల సమాచారం మేరకు వాహనాల తనిఖీ నిర్వహించి గంజాయిని సీజ్‌ చేసినట్లు ఎస్పీ తెలిపారు. 

ఎక్కడైనా గంజాయి సాగుచేస్తున్నట్లుగానీ, రవాణా చేస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు. యువకులు గంజాయికి బానిసై తమ విలువైన భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారని, కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నారని అన్నారు. ఈ తరహా వ్యక్తులు డబ్బుల కోసం నేరాలు చేసేందుకు కూడా వెనకాడబోరని అన్నారు. అలా జరగకుండా ఉండాలంటే అందరూ కలిసి గంజాయి అనే మహమ్మారిని అంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు నవంబర్‌ 30 జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ఠ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ క్రమంలోనే  టాస్క్ ఫోర్స్ బృందాలు, సంగారెడ్డి రూరల్ సిబ్బంది కలిసి సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. కీలకంగా వ్యవహరించిన ఇన్‌స్పెక్టర్‌ మహేష్ గౌడ్,  కానిస్టేబుళ్లు ఇస్మాయిల్, శంకర్ తదితరులను ఎస్పీ అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని