logo

లారీ ఢీకొని ప్రసాదంపాడు వాసి దుర్మరణం

చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు.

Published : 19 Apr 2024 05:03 IST

రాములవారి దర్శనానికి వెళుతుండగా ఘటన

రామవరప్పాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచంద్రుగొండ, న్యూస్‌టుడే: చంద్రుగొండ మండలం అయ్యన్నపాలెం ఒడ్డు వద్ద గల మలుపు సమీపంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన శ్రీకృష్ణచక్రపాణి(61) మృతి చెందారు.  చంద్రుగొండ ఎస్‌ఐ మాచినేని రవి కథనం ప్రకారం.. విజయవాడ ప్రసాదంపాడులోని సాయిబాబా ఆలయం సమీప మధు క్లాసిక్‌లో నివసిస్తున్న ఆతుకూరు శ్రీకృష్ణచక్రపాణి గురువారం వేకువజామునే భద్రాచలంలోని రామాలయానికి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు ఆయన భార్య దమయంతి గంపలగూడెం హిందీ పండిట్‌గా పనిచేస్తున్నారు. ఆమె బస్సులో వెళ్లమని సూచించినా తన స్కూటర్‌పైనే బయలుదేరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం ఆయన్నపాలెం మలుపు వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ద్విచక్ర వాహనం రోడ్డు పక్కన పడగా.. రహదారిపై పడిపోయిన శ్రీకృష్ణచక్రపాణి పైనుంచి లారీ వెళ్లింది. దీంతో అతను అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. సంఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని లారీని పోలీసుస్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.  రాములవారిని దర్శించుకుని వస్తానని చెప్పివెళ్లి ఇలా మృత్యుపాలయ్యారని, బస్సులో వెళితే బాగుండేదని మృతుడి భార్య దమయంతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని