icon icon icon
icon icon icon

భాజపాకు రజాకార్లకు పట్టిన గతే

‘గుజరాత్‌ ఆధిపత్యానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు ఇది.. కుట్రలకు పాల్పడుతున్న భాజపాకు నిజాం, రజాకార్లకు పట్టిన గతే పడుతుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Published : 02 May 2024 03:03 IST

ఎస్సీ, ఎస్టీ, బీసీలను జాగృతం చేస్తున్నానని పగబట్టి కేసు పెట్టారు
ఆషామాషీ ఎన్నికలు కావివి.. ఆలోచించి ఓటేయాలి
కోరుట్ల సభ, కూకట్‌పల్లి, మూసాపేట ర్యాలీల్లో సీఎం రేవంత్‌రెడ్డి

కరీంనగర్‌, హైదరాబాద్‌ - ఈనాడు, న్యూస్‌టుడే యంత్రాంగం: ‘గుజరాత్‌ ఆధిపత్యానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరు ఇది.. కుట్రలకు పాల్పడుతున్న భాజపాకు నిజాం, రజాకార్లకు పట్టిన గతే పడుతుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని లింగంపల్లిలో, మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని మూసాపేట, కూకట్‌పల్లిలలో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లలో ఆయన మాట్లాడారు. ఆయా చోట్లా కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ‘‘ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆషామాషీవి కావు. గతంలోకంటే భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొన్నాయి. 400 సీట్లు గెలవడం ద్వారా రిజర్వేషన్లను ఎత్తివేసి అదానీ, అంబానీలకు దేశాన్ని అమ్మాలని భాజపా కుట్ర చేస్తోంది. ఊరూరా బీసీ, ఎస్సీ, ఎస్టీలను జాగృతం చేస్తున్నానని.. పగబట్టి నన్ను అత్యవసరంగా అరెస్టు చేయాలని దిల్లీలో కేసు పెట్టారు. ఒకవేళ నేను మాట్లాడింది తప్పయితే.. తెలంగాణకు చెందిన బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, కిషన్‌రెడ్డిలు ఇక్కడి పోలీసు స్టేషన్లలో ఎందుకు ఫిర్యాదు చేయలేదు? దిల్లీ పోలీసులతో మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు. భాజపా నేతల వద్ద ఈడీ, ఐటీ, సీబీఐ ఉండొచ్చు. కానీ, నా దగ్గర నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలున్నారు. 50 లక్షల మంది తెలంగాణ యువత ఉన్నారు.

మనమంతా ఏకమవ్వాల్సిన సమయం..

మోదీ ప్రధానిగా కాకుండా గుజరాత్‌ వ్యక్తిగా తెలంగాణకు వచ్చి మనల్ని తిట్టారు.. శపించారు.. మనల్ని దెబ్బతీయాలని కుట్రలు చేస్తున్నారు.. ఎన్నికల సమయంలో వస్తే ఈ ప్రాంతానికి ఏం ఇస్తారో.. ఏం చేస్తారో చెప్పాలి. వాళ్లు అవి చెప్పడం లేదు. గతంలో బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ అన్నింటినీ పక్కన పెట్టారు. అయిదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని.. అయిదేళ్లయినా ఇవ్వలేదు. నేనూ స్వయంగా కలిసి పలు సమస్యలపై విన్నవించా. ప్రధాని వీటన్నింటిపై మాట్లాడతారని అనుకున్నా.. కానీ, మాట్లాడలేదు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీని లేకుండా చేయాలని చూస్తున్నారు. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటున్నారు.. కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ అంటే.. మేంతెచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయడమేనా? తెలంగాణ ప్రజలు ఆలోచించి ఈ ఎన్నికల్లో ఓట్లు వేయాలి. పక్క ఊరతను మనల్ని అవమానిస్తే ఊరుకుంటామా? మనకు విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఊరందరం ఏకమవ్వాల్సిన సమయమిది. మోదీజీ.. ప్రధానిగా మీకు ప్రజలు బాధ్యతనిచ్చింది రేవంత్‌రెడ్డిని పోలీసు స్టేషన్‌లో వేయడానికేనా? ఆధిపత్యం చెలాయించి అన్యాయంగా రాజ్యాలు ఏలాలనుకుంటే నిజాం నవాబుకు ఏ గతి పట్టిందో కనుక్కోండి. రజాకార్లకు ఏ పరిస్థితి ఎదురైందో తెలుసుకోండి. బుధవారం రావాలంటూ నాకు నోటీసులు ఇచ్చారు. నేను రాను మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటూ సమాధానమిచ్చా. రేవంత్‌ను అడ్డుకోవాలంటే దిల్లీలో కేసులు పెట్టి వారం రోజులు తీసుకుని వెళ్లండంటూ మోదీకి కేసీఆర్‌ చెప్పారేమోనని అనుమానం వస్తోంది. దురదృష్టవశాత్తు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి(ప్రస్తుత నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి) జగిత్యాలలో ఓడిపోయారు. లేదంటే నా మంత్రివర్గంలో కీలక శాఖలో ఉండేవారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆయన కేంద్ర వ్యవసాయ మంత్రి అవుతారు’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంటింటికీ గాడిదగుడ్డును పంపించిన మోదీకి ఓట్లేద్దామా? అన్ని పథకాలు ఇచ్చిన కాంగ్రెస్‌కు వేద్దామా అని ఓటర్లను ప్రశ్నించారు. ఆయా కార్యక్రమాల్లో అభ్యర్థులు జీవన్‌రెడ్డి(నిజామాబాద్‌), రంజిత్‌రెడ్డి(చేవెళ్ల), సునీతా మహేందర్‌రెడ్డి(మల్కాజిగిరి) తదితరులు పాల్గొన్నారు. కోరుట్లలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని ముఖ్యమంత్రిని జీవన్‌రెడ్డి కలిసి ఒప్పించారని, ప్రవాస భారతీయుల సంక్షేమానికి హామీ ఇచ్చే విధంగా చొరవ చూపించారని గుర్తుచేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ దేశంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు.


గుజరాత్‌ ఆధిపత్యానికి.. తెలంగాణ ఆత్మగౌరవానికి పోటీ ఇది. తెలంగాణ పౌరుషం గెలుస్తుందో.. గుజరాత్‌ ఆధిపత్యం గెలుస్తుందో చూద్దాం. ఆ రాష్ట్రం నుంచి వచ్చి నా రాష్ట్రం నడిగడ్డ మీద ముఖ్యమంత్రిని బెదిరిస్తుంటే చూస్తూ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఖబడ్దార్‌ ప్రధానమంత్రి గారూ..! నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా? నేనేం మాట్లాడాను.. రిజర్వేషన్లు రద్దు చేయవద్దని కోరా. రాజ్యాంగాన్ని మార్చవద్దన్నా. మీకు నచ్చితే నా మాట వినండి. నచ్చక పోతే రిజర్వేషన్లు రద్దుచేస్తామని చెప్పి ఓట్లు అడగండి.

సీఎం రేవంత్‌రెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img