Telangana Elections: తదుపరి కార్యాచరణపై అధిష్ఠానానిదే నిర్ణయం: డీకే శివకుమార్
తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో (Telangana Election Results 2023) కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో (Telangana Election Results 2023) కాంగ్రెస్ (Congress) పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (Dk shivakumar) మీడియాతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్లకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇప్పడు ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే సమాధానం ఇచ్చేశారని.. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక వాళ్లు పెట్టిన ట్వీట్లకు తాము సమాధానం ఇస్తామని చెప్పారు.
రేవంత్ను కలిసిన డీజీపీ
ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు. రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, మరికొందరు పోలీసు అధికారులు రేవంత్ ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు.
మరోవైపు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ విజయాన్ని సోనియాగాంధీకి బర్త్డే గిఫ్ట్గా ఇస్తున్నామన్నారు. తాను సీఎం రేసులో ఉన్నానా? లేదా? అన్నది అప్రస్తుతమన్నారు. రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాబట్టే డీజీపీ వెళ్లి కలిశారని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.