icon icon icon
icon icon icon

ఎన్నాళ్లకెన్నాళ్లకు..!

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సుదీర్ఘ కాలం తరువాత జెండా ఎగరేసింది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకుని తెలంగాణ ఆవిర్భావం తర్వాతా చేజిక్కని నియోజకవర్గాల్లో 2023 శాసనసభ ఎన్నికల్లో విజయం అందుకుంది.

Updated : 04 Dec 2023 07:29 IST

సుదీర్ఘకాలం తరువాత కాంగ్రెస్‌కు అనూహ్య విజయాలు

రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ సుదీర్ఘ కాలం తరువాత జెండా ఎగరేసింది. ఉమ్మడి రాష్ట్రం మొదలుకుని తెలంగాణ ఆవిర్భావం తర్వాతా చేజిక్కని నియోజకవర్గాల్లో 2023 శాసనసభ ఎన్నికల్లో విజయం అందుకుంది. దశాబ్దాల తరబడి చేయి గుర్తు మాట వినిపించని చోట పాగా వేయడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి.

నర్సంపేట..  56 ఏళ్లకు

నర్సంపేట నియోజకవర్గం 56 ఏళ్ల అనంతరం కాంగ్రెస్‌ చేజిక్కింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి భారాస అభ్యరి,్థ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిపై విజయం సాధించారు. చివరగా 1967లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సుదర్శన్‌రెడ్డి సీపీఎం అభ్యర్థి ఎ.వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు.  

పాలకుర్తి.. 40 ఏళ్లకు

2009లో ఏర్పాటైన పాలకుర్తిలో కాంగ్రెస్‌కు ఇదే తొలి విజయం. చివరగా.. ఈ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు పాత చెన్నూరు పరిధిలో(రద్దయిన) ఉండగా 1983లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2009 నుంచి గెలుస్తూ వస్తున్న ఎర్రబెల్లి దయాకరరావుపై ఇప్పుడు యశస్వినిరెడ్డి గెలిపొందారు.

భువనగిరి.. 40 ఏళ్లకు

భువనగిరి కోటపై నలభై ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. హ్యాట్రిక్‌ ప్రయత్నంలో ఉన్న భారాస అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డిపై కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డి... విజయం సాధించారు. ఇక్కడ చివరగా 1983లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన కె.నర్సింహారెడ్డి విజయం సాధించారు.

నాగర్‌కర్నూల్‌.. 34 ఏళ్లకు

నాగర్‌కర్నూల్‌ను 34 ఏళ్ల అనంతరం కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. హ్యాట్రిక్‌కు ప్రయత్నిస్తున్న భారాస అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి గెలుపొందారు. చివరగా ఇక్కడ 1989లో కాంగ్రెస్‌ తరఫున వంగా మోహన్‌గౌడ్‌ విజయం సాధించారు.

రామగుండం.. 34 ఏళ్లకు

రామగుండం నియోజకవర్గాన్ని 34 ఏళ్ల అనంతరం కాంగ్రెస్‌ పొందింది. కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌ సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే భారాస అభ్యర్థి కోరుకంటి చందర్‌పై విజయం సాధించారు. మేడారం నియోజకవర్గం(2009లో రద్దు)గా ఉన్న సమయంలో 1989లో కాంగ్రెస్‌ నుంచి మాతంగి నర్సయ్య విజయం సాధించారు.  

ఖానాపూర్‌... 30 ఏళ్లకు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధి ఖానాపూర్‌(ఎస్టీ) ఎట్టకేలకు ‘హస్త’గతమైంది. ఆ పార్టీ అభ్యర్థి వెడ్మ బొజ్జు తన సమీప భారాస అభ్యర్థి, మంత్రి కేటీఆర్‌ స్నేహితుడైన జాన్సన్‌ నాయక్‌పై 4,976 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి చరిత్రను తిరగరాశారు.

వేములవాడ.. 25 ఏళ్లకు

25 ఏళ్ల క్రితం మెట్‌పల్లి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ విజయం సాధించింది. 1998 ఉప ఎన్నికలో కొమ్మిరెడ్డి జ్యోతి విజయం సాధించారు. 2009లో వేములవాడ నియోజకవర్గం ఏర్పాటైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ గెలుపొందారు.

వరంగల్‌ పశ్చిమ... పాతికేళ్లకు

వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో 25 ఏళ్ల అనంతరం కాంగ్రెస్‌ పాగా వేసింది. కాంగ్రెస్‌ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి.. భారాస ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌పై విజయం సాధించారు. చివరిసారి 1998 ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగారావు ఇక్కడ విజయం సాధించారు.

చొప్పదండి.. 24 ఏళ్లకు

చొప్పదండి నియోజకవర్గాన్ని 24 ఏళ్ల అనంతరం కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థి మేడిపల్లి సత్యం సిట్టింగ్‌ ఎమ్మెల్యే, భారాస అభ్యర్థి సుంకె రవిశంకర్‌పై విజయం సాధించారు. చివరిగా 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి కె.సత్యనారాయణ గౌడ్‌ విజయం సాధించారు.

ధర్మపురి.. 24 ఏళ్లకు

ధర్మపురిలో ఎ.లక్ష్మణ్కుమార్‌ భారాస అభ్యర్థి మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై విజయం సాధించారు. నాలుగు ఎన్నికల అనంతరం లక్ష్మణ్‌కు విజయం దక్కింది. ధర్మపురి.. ఇందుర్తిగా ఉన్నప్పుడు 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి బొమ్మా వెంకటేశ్వర్‌ విజయం సాధించారు. 2009లో ధర్మపురి కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img