icon icon icon
icon icon icon

సంప్రదాయానికే పట్టం

ప్రభుత్వ మార్పు సంప్రదాయానికే రాజస్థాన్‌ ప్రజలు జై కొట్టారు. ఆద్యంతం విభేదాలతో సాగిన కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడారు.

Updated : 04 Dec 2023 07:26 IST

రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని మార్చేసిన జనం
కాంగ్రెస్‌ను ముంచిన వర్గ విభేదాలు
యువత, మహిళలు దూరం

జైపుర్‌: ప్రభుత్వ మార్పు సంప్రదాయానికే రాజస్థాన్‌ ప్రజలు జై కొట్టారు. ఆద్యంతం విభేదాలతో సాగిన కాంగ్రెస్‌ పాలనకు చరమగీతం పాడారు. హిందుత్వ వ్యూహం, మోదీ ప్రజాకర్షణ శక్తి పని చేయడంతో రాజస్థాన్‌ పీఠాన్ని భాజపా కైవసం చేసుకుంది. 25 ఏళ్లుగా రాజస్థాన్‌ ప్రజలు అధికార పార్టీని మారుస్తూనే ఉన్నారు. 1998 నుంచి రాజస్థాన్‌లో ఐదేళ్లకోసారి అధికార పార్టీ మారుతూ వస్తోంది. ఐదేళ్లు కాంగ్రెస్‌, మరో ఐదేళ్లు భాజపా పాలిస్తూ వస్తున్నాయి.

కాంగ్రెస్‌పై వ్యతిరేక పవనాలే!

గహ్లోత్‌ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతే ఎన్నికల్లో భాజపాకు సానుకూలంగా మారినట్లు తెలుస్తోంది. యువత, మహిళల్లో గహ్లోత్‌ సర్కారుపై ఉన్న అసంతృప్తి ఫలితాల్లో ప్రస్ఫుటమైంది. రాష్ట్రంలో నాలుగేళ్ల వ్యవధిలో 18 సార్లు పరీక్షా పేపర్లు లీక్‌ అయ్యాయి. యువతతోపాటు వారి కుటుంబాల్లోనూ వీటిపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ సర్కారుపై వ్యతిరేకత కాస్తా భాజపాకు సానుకూలంగా మారడం ప్రారంభమైంది. కమలనాథులు జోరు ప్రదర్శించి అసంతృప్త ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారు.

మహిళల్లోనూ..

అటు, మహిళల్లోనూ అసంతృప్తి రగలడం గహ్లోత్‌ సర్కారును కోలుకోలేకుండా చేసింది. అత్యాచారాలు సహా మహిళలపై నేరాలు పెరిగిపోవడం ఆ పార్టీ అవకాశాలను దెబ్బతీసింది. అదే సమయంలో భాజపా మహిళాకర్షక పథకాలతో మేనిఫెస్టో ప్రకటించింది. పోలీస్‌ స్టేషన్లలో మహిళల కోసం ప్రత్యేక డెస్క్‌లు, యాంటీ రోమియో స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. 12వ తరగతి విద్యార్థినులకు ఫ్రీగా స్కూటర్లను ఇస్తామని ప్రకటించింది. నిరుద్యోగ యువతను ఆకట్టుకునేలా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఐదేళ్లలో భర్తీ చేస్తామని మాటిచ్చింది. ఇది ఆ పార్టీకి సానుకూలంగా మారినట్లు తెలుస్తోంది.

సామాజిక సమీకరణాలు

రాష్ట్ర స్థాయి నాయకత్వం విషయంలో రెండు పార్టీల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. రెండు పార్టీల్లోనూ వర్గ విభేదాలు తీవ్రంగానే ఉన్నాయి. అయితే కాంగ్రెస్‌ విషయంలో ఇది మరింత అధికంగా ఉంది. గహ్లోత్‌, పైలట్‌ మధ్య పోరు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఎన్నికల సమయంలో వీరిద్దరూ స్నేహగీతం పాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు భాజపా సైతం మాజీ సీఎం వసుంధరా రాజెకు కళ్లెం వేసి కొత్త నాయకత్వానికి బీజం వేసింది. ఎంపీ దియా కుమారిని రంగంలోకి దించింది. ఈ పరిణామాలు సామాజికంగా భాజపాకు కలిసివచ్చినట్లే కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో వసుంధర రాజెపట్ల వ్యతిరేకతతో రాజ్‌పుత్‌లు భాజపాను దూరం పెట్టారు. సచిన్‌ పైలట్‌ ముఖ్యమంత్రి అవుతారని భావించి గుజ్జర్లు కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితి మారిపోయింది. పైలట్‌ను కాంగ్రెస్‌ దూరం పెట్టడం గుజ్జర్ల ఓట్లపై ప్రభావం చూపింది.


మోదీ కరిష్మా

రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేనప్పటికీ ఎన్నికల్లో విజయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా అధిష్ఠానమే కారణమని స్పష్టమవుతోంది. అనేక వర్గాలుగా ఉన్న పార్టీని కేంద్ర పెద్దలే ముందుండి నడిపించారు. ప్రచారంలోనూ వారే ప్రధాన భూమిక పోషించారు. ఎన్నికల ప్రచారం మోదీ వర్సెస్‌ గహ్లోత్‌గా సాగింది. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ఎంపీలను రంగంలోకి దించింది భాజపా. ఎంపీలుగా వీరు చేసిన సేవలు అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగపడతాయని భావించి ఈ వ్యూహం అమలు చేసింది. కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌, దియా కుమారి సహా పలువురు ప్రముఖులను బరిలో దించి సానుకూల ఫలితాలను సొంతం చేసుకుంది.

ప్రభుత్వంపై వ్యతిరేకత

ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో సరిగా అమలు కాలేదని కాంగ్రెస్‌లోనే అంతర్గతంగా గుసగుసలు వినిపించాయి. దీంతో పథకాలను సరిగా ప్రచారం చేసుకోలేకపోయారు. వంట గ్యాస్‌పై సబ్సిడీ వంటి స్కీమ్‌లతో రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను గహ్లోత్‌ కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానికంగా ఈ వ్యతిరేకత తగ్గకపోవడం నెగెటివ్‌గా మారింది.

రెబల్స్‌ సమస్య

రాష్ట్రంలో రెబల్స్‌ కాంగ్రెస్‌కు తలనొప్పి తెచ్చిపెట్టారు. సొంత పార్టీ నేతలే అనేక ప్రాంతాల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీశారు. ఏఐసీసీ ఇంఛార్జులు రంగంలోకి దిగినా రెబల్స్‌ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ఓట్లలో భారీగా చీలిక వచ్చి భాజపాకు లాభం చేకూరినట్లు తెలుస్తోంది.


పనిచేసిన హిందుత్వ!

రాజస్థాన్‌ వ్యాప్తంగా హిందుత్వ అంశం ఎన్నికల్లో ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. గహ్లోత్‌ సర్కారు ముస్లింలకు అనుకూలంగా ఉందనే వాదనల మధ్య భాజపా అధికారంలోకి రావాలని హిందూ ఓటర్లలో భావన వ్యక్తమైనట్లు సమాచారం. కన్హయ్యలాల్‌ హత్య ఉదంతం ఎన్నికల సమయంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌వల్లే రాజస్థాన్‌లో అలాంటి ఘటనలు జరిగాయనే అభిప్రాయం హిందూ ఓటర్లలో ఉంది. ఇది భాజపా అనుకూల పవనాలకు కారణమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img