Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీకోసం....

Updated : 13 May 2021 09:13 IST

1. కారును ఢీకొన్న‌ లారీ.. నలుగురి మృతి

తూర్పు గోదావ‌రి జిల్లా సామ‌ర్లకోట వ‌ద్ద ఈ ఉద‌యం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఏడీబీ ర‌హదారిపై కారును లారీ ఢీకొన‌డంతో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృత‌దేహాల‌ను పెద్దాపురం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కారు కాకినాడ నుంచి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం వెళుతుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

2. Corona లక్షణాలున్నవారు లక్షన్నర మంది

రాష్ట్ర వ్యాప్తంగా జ్వర బాధితులను గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వైద్య బృందాలు ఇల్లిల్లూ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తున్నాయి. ఈ గణాంకాల ఆధారంగా గత వారం రోజుల్లో కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వారు దాదాపు లక్షన్నరకు పైగానే ఉన్నట్లు తేలింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

TS Lockdown: తొలిరోజు పకడ్బందీగా...

* ఒక్క రోజే రూ.125 కోట్ల మద్యం అమ్మకం! 

3. రైతు భరోసా సాయం 3,928 కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకంలో మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడత సాయాన్ని ప్రభుత్వం గురువారం విడుదల చేయనుంది. 52.38 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.3,928.88 కోట్లు జమయ్యేలా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కనున్నారు. అర్హులైన ఒక్కో రైతు కుటుంబానికి రైతు భరోసా కింద ప్రభుత్వం ఏటా మూడు విడతలుగా రూ.13,500 సాయం అందిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి 

* మన వర్సిటీలు ర్యాంకుల్లో ముందుండాలి: Jagan

4. మీటర్‌ రీడింగ్‌ మీరే తీసుకోవచ్చు

ప్రతి నెలా మీ ఇంటి విద్యుత్‌ మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసి బిల్‌ ఇచ్చేందుకు ఇకపై సిబ్బంది రావాల్సిన పనిలేదు. మీ సెల్‌ఫోన్‌తో మీరే మీటర్‌ రీడింగ్‌ని స్కాన్‌ చేసి.. బిల్లు తీసుకునే యాప్‌ అందుబాటులోకి వచ్చింది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) బుధవారం ఈ సేవలను ప్రారంభించింది. సంస్థ ఐటీ యాప్‌లో ‘కన్జ్సూమర్‌ సెల్ఫ్‌ బిల్లింగ్‌’ ఐచ్ఛికాన్ని జోడించి గూగుల్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంచింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. Ruia మృతులు 31 మంది: Nimmala

‘‘తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక చనిపోయిన 31 మంది వివరాలు మా వద్ద ఉన్నాయి. వీరు కాక మరో 10 నుంచి 15 మంది మృతులు ఉండొచ్చు. వారి సమాచారమూ సేకరిస్తున్నాం. వాస్తవం ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 11 మందే చనిపోయారని చెప్పి ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది’’ అని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. Corona: కుటుంబాల్లో కల్లోలం

ఆనందంగా సాగిపోతున్న కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతోంది. ఒకే ఇంట్లో ఇద్దరు..ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. కొన్నిచోట్ల ఇంట్లో చనిపోయిన వారి అంత్యక్రియలు పూర్తయ్యేలోపే మరొకరి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దంపతులు, కూతుళ్లు, కుమారులు, అత్తమామలు, సమీప బంధువులను ఈ రక్కసి బలి తీసుకుంటోంది. ఇంట్లో ఒకరికి వస్తే.. మిగిలిన వారు హడలిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు పదిరోజుల వ్యవధిలో ప్రాణాలు విడిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. స్వీయ తప్పిదాలే కారణం

రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలు భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణకు కారణమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. సంక్రమణ వేగం ఎక్కువగా ఉన్న వైరస్‌ రకాలూ ఉద్ధృతిని పెంచాయని తెలిపింది. భారత్‌లో కేసులు వేగం పుంజుకోవడం వెనక ఉన్న కారణాలపై డబ్ల్యూహెచ్‌వో తాజాగా మదింపు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. Covid Vaccine గర్భిణులకు సురక్షితమే

కరోనా వైరస్‌ బారిన పడకుండా రక్షణ పొందేందుకు తీసుకొనే టీకాలు గర్భిణులకూ సురక్షితమైనవేనన్న ప్రాథమిక నిర్ధరణకు వైద్య నిపుణులు వచ్చారు. టీకా వల్ల గర్భంలోని మాయకు హాని కలుగుతుందనేందుకు ఆధారాలు లభించలేదని ‘ఆబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ’ జర్నల్‌ తన తాజా సంచికలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. ఆగని దాడులు

ఇజ్రాయెల్‌ బలగాలు, హమాస్‌ ఉగ్రవాదుల మధ్య దాడుల పరంపర కొనసాగుతోంది. గాజా నుంచి వందల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ ప్రయోగిస్తుండగా.. పదుల కొద్దీ వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. దీంతో అక్కడి పరిస్థితులు 2014 నాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గాజాపై జరిగిన దాడుల్లో మొత్తం 48 మంది పాలెస్తీనియన్లు మృత్యువాతపడ్డారు. దాదాపు 300 మంది గాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. Olympics: సైనా, శ్రీకాంత్‌ ఆశలు ఆవిరి

భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సైనా నెహ్వాల్‌, కిదాంబి శ్రీకాంత్‌ల ఒలింపిక్‌ ఆశలు ఆవిరయ్యాయి. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించి పతకం సాధించాలన్న కలలు కల్లలయ్యాయి. ఒలింపిక్స్‌కు ముందు చివరి అర్హత టోర్నీ సింగపూర్‌ ఓపెన్‌ రద్దవడంతో సైనా, శ్రీకాంత్‌ల అవకాశాలకు తెరపడింది. జూన్‌ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్‌ ఓపెన్‌ను కరోనా మహమ్మారి, ప్రయాణ సంబంధిత ఆంక్షల కారణంగా రద్దు చేస్తున్నట్లు బీడబ్ల్యూఎఫ్‌ బుధవారం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

* Olympics: ఇటు సన్నాహాలు..అటు ఆందోళనలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని