Farmers Protest: రైతులతో ముగిసిన చర్చలు.. కనీస మద్దతు ధరపై కేంద్రం కీలక ప్రతిపాదన

Farmers Protest: దిల్లీ శివారులో ఆందోళన చేపట్టిన రైతులతో ప్రభుత్వం జరిపిన నాలుగో విడత చర్చలు సోమవారం తెల్లవారుజామున ముగిశాయి. కనీస మద్దతు ధరపై కేంద్రం ఓ కీలక ప్రతిపాదనను అన్నదాతల ముందుంచింది.

Updated : 19 Feb 2024 07:34 IST

చండీగఢ్‌: డిమాండ్ల సాధనకై ‘దిల్లీ చలో’ పేరిట ఆందోళన చేపట్టిన రైతులతో (Farmers Protest) కేంద్రం జరిపిన నాలుగో విడత చర్చలు ముగిశాయి. ఆదివారం సాయంత్రం 8:15 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ సోమవారం తెల్లవారుజామున ఒంటి గంట వరకు కొనసాగింది. ప్రభుత్వం తరఫున వ్యవసాయశాఖ మంత్రి అర్జున్‌ ముండా, వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయెల్‌, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్‌ రైతు నేతలతో చర్చలు జరిపారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం గోయెల్ విలేకరులతో మాట్లాడుతూ.. రైతులతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఐదేళ్లపాటు పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తి పంటలను ప్రభుత్వ ఏజెన్సీలు కనీస మద్దతు ధర (MSP)కు కొనుగోలు చేస్తాయని తమ బృందం ప్రతిపాదించినట్లు చెప్పారు. కందులు, మినుములు, మైసూర్‌ పప్పు, మొక్కజొన్న పండించే సాగుదారులతో ఎన్‌సీసీఎఫ్‌, ఎన్‌ఏఎఫ్‌ఈడీ వంటి సహకార సంఘాలు ఒప్పందం కుదుర్చుకుంటాయని తెలిపారు. కొనుగోలు చేసే పరిమాణంపై ఎటువంటి పరిమితి ఉండదని పేర్కొన్నారు. దీని కోసం ఒక పోర్టల్ కూడా అభివృద్ధి చేస్తామన్నారు. తమ ప్రతిపాదనల వల్ల పంజాబ్‌లో వ్యవసాయానికి రక్షణ లభిస్తుందని తెలిపారు. భూగర్భ జలమట్టాలు మెరుగవుతాయన్నారు. సాగు భూములు నిస్సారంగా మారకుండా ఉంటాయని చెప్పారు.

ప్రభుత్వ ప్రతిపాదనలపై రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ స్పందించారు. దీనిపై సోమ, మంగళవారాల్లో తమ సంఘాలతో చర్చిస్తామన్నారు. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు. రుణమాఫీ వంటి డిమాండ్లు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ‘దిల్లీ చలో’ కార్యక్రమాన్ని నిలిపివేశామని.. ఒకవేళ తమ డిమాండ్లన్నింటికీ పరిష్కారం లభించకపోతే ఫిబ్రవరి 21న తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.

ఫిబ్రవరి 8, 12, 15న జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం తేలకుండా ముగిసిన విషయం తెలిసిందే. దిల్లీ చలో పేరిట దేశ రాజధానిలోకి ప్రవేశించేందుకు వచ్చిన రైతులను పోలీసులు ఫిబ్రవరి 13న శివారులోని శంభు, ఖనౌరీ ప్రాంతంలో అడ్డుకున్నారు. అప్పటి నుంచి వారు అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. సంయుక్త కిసాన్‌ మోర్చా (నాన్‌-పొలిటికల్), కిసాన్ మజ్దూర్‌ మోర్చా ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. కనీస మద్దతు ధరపై (MSP) చట్టంతో పాటు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతులు, వ్యవసాయ కూలీలకు పింఛన్లు, పంట రుణాల మాఫీ, విద్యుత్‌ ఛార్జీలపై టారిఫ్‌ల పెంపు నిలుపుదల, 2021 నిరసన సమయంలో రైతులపై నమోదైన కేసుల ఎత్తివేత, అప్పటి ఆందోళనల్లో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం, భూసేకరణ చట్టం 2013 పునరుద్ధరణ వంటివి అన్నదాతల డిమాండ్లలో ప్రధానమైనవి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని