Aamir Khan: ఆ సీన్‌లో నగ్నంగా నటించాను: ఆమిర్‌ ఖాన్‌

రెండేళ్ల నుంచి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు ఆమిర్ ఖాన్‌ చెప్పారు.

Updated : 29 Apr 2024 20:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తాను నటించిన ఓ సినిమాలోని సన్నివేశంలో నగ్నంగా నటించినట్లు ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) తాజాగా వెల్లడించారు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే కామెడీ షో ‘కపిల్‌ శర్మ షో’కు ఆమిర్‌ మొదటిసారి హాజరయ్యారు. అందులో తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. 2014లో రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘పీకే’. ఈ సినిమాలోని సన్నివేశంపై తాజాగా ఆయన స్పందించారు.

‘‘పీకే’లో నేను రేడియో పట్టుకుని నగ్నంగా పరిగెత్తే సన్నివేశం ఉంటుంది. దాన్ని షూటింగ్‌ మొదలుపెట్టగానే దర్శకుడు అందరి ఫోన్‌లు తీసేసుకున్నారు. నాకు చిన్న ప్రత్యేకంగా తయారు చేసిన షార్ట్‌లు ఇచ్చారు. పొత్తికడుపులో దెబ్బతగలకుండా క్రికెట్‌లో వాడే గార్డ్స్‌లాగా ఉంటాయి. వాటితో కేవలం ముందువైపు మాత్రమే కప్పుకోవడానికి వీలవుతుంది. అది వేసుకుని, రేడియో పట్టుకుని పరిగెత్తడం మొదలు పెట్టాను. టేపుతో అంటించడం వల్ల పరిగెత్తేటప్పుడు ఆ షార్ట్‌ ఊడిపోయి చాలా ఇబ్బందిగా అనిపించింది. రెండు మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత దాన్ని తీసేస్తానని హిరాణీకి చెప్పా. అందరినీ కెమెరా నుంచి దూరంగా వెళ్లమని చెప్పి నగ్నంగా పరిగెత్తాను. అది చిత్రీకరించేటప్పుడు ముందు కాస్త కంగారుపడ్డాను. సన్నివేశం బాగా రావడం కోసం ఏమైనా చేయాలనుకునే స్వభావం నాది. అందుకే చేశాను. అప్పుడేం అనిపించలేదు కానీ, సినిమాలో ఆ సీన్‌ చూసిన తర్వాత షాకయ్యాను. నేనేనా ఇలా చేసిందనిపించింది’ అని ఆమిర్‌ చెప్పారు. రూ.85 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఏకంగా రూ.850 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది.

ఇక ఇదే కార్యక్రమంలో ఆమిర్‌ తనకు రెండేళ్ల నుంచి కష్టసమయం నడుస్తున్నట్లు చెప్పారు. ‘నేను ఏ అవార్డు వేడుకలకు, టీవీ షోలకు రాను. కానీ కపిల్‌ శర్మ కార్యక్రమానికి రావడానికి ప్రత్యేక కారణముంది. గత రెండేళ్లుగా నేను చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నా. మానసికంగా చాలా వీక్‌గా ఉన్నా. ఎంత బాధలో ఉన్నా సరే ఈ కార్యక్రమం చూస్తే నవ్వొస్తుంది. అందుకే దీనికి రావాలని నిర్ణయించుకున్నా’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని