Aditi Rao: సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు

తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు.

Published : 02 May 2024 14:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్: నటి అదితిరావు హైదరీ (Aditi rao Hydari)-సిద్ధార్థ్‌ (Siddharth)ల నిశ్చితార్థం గత నెలలో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై అదితి స్పందించారు. మీడియా వాళ్లకు వెల్లడించడానికి గల కారణాన్ని తెలిపారు. తన తల్లి కోరికమేరకు నిశ్చితార్థం జరిగినట్లు పోస్ట్‌ పెట్టానన్నారు.

‘‘జీవితంలో జరిగే ముఖ్యమైన వాటిని ప్రత్యేక ప్రదేశంలో చేసుకోవాలని అందరూ అనుకుంటారు. నేను నా నిశ్చితార్థాన్ని 400 ఏళ్ల నాటి గుడిలో చేసుకున్నాను. ఆ దేవాలయంతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. మా అమ్మ కారణంగానే ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలను పోస్ట్‌ చేశాను. మా పెళ్లి గురించి తెలుసుకోవాలని ఎంతోమంది మా అమ్మకు ఫోన్లు చేశారు. నిరంతరం వచ్చిన కాల్స్‌కు ఆమె సమాధానం చెప్పలేకపోయింది. ‘దయచేసి నీ ఎంగేజ్‌మెంట్ విషయం మీడియాకు వెల్లడించు’ అని కోరింది. దీంతో నేను, సిద్ధార్థ్‌ దీనిపై పోస్ట్‌లు పెట్టాం’’ అని అదితిరావు తెలిపారు. మార్చి 27న వనపర్తి జిల్లాలోని శ్రీ రంగాపూర్ రంగనాథ స్వామి దేవాలయంలో వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దలు, అతితక్కువమంది బంధువుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు.

తాజాగా అదితిరావు ‘హీరామండీ: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించారు. సంజయ్‌లీలా బన్సాలీ దర్శకుడు. ఇందులో ఆమె బిబ్బోజాన్‌ పాత్రలో ఆకట్టుకున్నారు. వేశ్య వృత్తితో సమాంతర వ్యవస్థను నడుపుతున్న కొంతమంది మహిళల జీవిత కథే ఈ సిరీస్‌. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ సిరీస్‌లో మనీషాకొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదాషేక్‌లు కీలకపాత్రలు పోషించారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది ప్రసారమవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని