
AndhraPradesh : అమూల్పై ఉన్న శ్రద్ధ పాడి రైతులపై ఎందుకు చూపడం లేదు?: అచ్చెన్నాయుడు
ఏపీ సీఎం జగన్కు లేఖ రాసిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
అమరావతి: పాడి రైతులకు ఇచ్చిన హామీల అమలులో ఏపీ సీఎం వైఎస్ జగన్ విఫమమయ్యాని ఏపీ తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. పాడి రైతులకు ఇచ్చిన ఏ హామీనీ నెరవేర్చలేదన్నారు. పాడి రైతుల సమస్యలపై సీఎం జగన్కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. రైతులకు ఇస్తామన్న రూ.4 బోనస్ ఏమైందని ప్రశ్నించారు. అమూల్ కోసం ఉపాధి హామీ నిధులనూ దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు.
‘‘అమూల్పై ఉన్న శ్రద్ధ పాడి రైతులపై ఎందుకు చూపడం లేదు? అమూల్ వల్ల రూ. 5 నుంచి రూ. 20 వరకు అదనపు లబ్ధి అనేది అవాస్తవం. రాష్ట్రానికి చెందిన డెయిరీలపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. అమూల్ కోసం రూ. 3 వేల కోట్లు ప్రజాధనాన్ని ధారాదత్తం చేస్తున్నారు. సహకార డెయిరీ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. చిత్తూరు జిల్లాలో వైకాపా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన శివశక్తి పాల డెయిరీలో రాష్ట్రంలోనే అతి తక్కువ ధరకు పాలు కొంటున్నారు. దేశంలో ఎక్కడైనా లీటర్ పాలకు రూ. 18 చెల్లించారా? రాష్ట్రంలోని సహకార డెయిరీలు, ఇతర సంస్థలను వదిలిపెట్టి బాలామృతం, అంగన్వాడీలకు పాల సరఫరా కోసం అమూల్తో ఒప్పందం చేసుకోవడం దుర్మార్గం. ఉన్మాద, కక్ష సాధింపు చర్యలతో ఆయా డెయిరీల్లో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. సహకార డెయిరీలను పునరుద్ధరిస్తామనే హామీని నెరవేర్చాలి’’ అని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.