Kodandaram: భారాస నేతలు ఇప్పటికీ ఆ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు: కోదండరామ్‌

భారాస పాలనలో ఆంక్షలు, భయం చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.

Updated : 12 Jan 2024 20:21 IST

హైదరాబాద్: భారాస పాలనలో ఆంక్షలు, భయం చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ (kodandaram) అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా ఫోన్లు మాట్లాడుకోగలుగుతున్నామన్నారు. కాంగ్రెస్‌ నెల రోజుల పాలన బాగుందన్నారు. నాలుగో తేదీలోగా జీతాలు వస్తున్నాయని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రజలతో కలిసిపోయి పని చేస్తున్నారు. దిల్లీలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరాం. గత ప్రభుత్వం నిరసన వ్యక్తం చేసినవారిపై కేసులు పెట్టింది. రాజకీయ ఉద్దేశంతో పెట్టిన కేసులు ఎత్తి వేయాలి. నియంతృత్వాన్ని ఓడించాలని పోరాటం చేశాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక సదస్సులు, సమావేశాలు నిర్వహించాం. ఎట్టకేలకు నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో విజయం సాధించాం. నియంత పోకడలే అధికారం కోల్పోవడానికి కారణమని ఇప్పటికీ భారాస నేతలు గుర్తించలేకపోతున్నారు.

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ తప్పుబట్టారు. ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. భద్రాచలం రాములవారి ఆలయానికి భద్రత లేకుండా పోయింది. తెలంగాణపై కేంద్రం చూపిస్తోన్న వివక్షను తెలియజేసేందుకు రాష్ట్రస్థాయి సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రజల పరిరక్షణ కోసం మేం ఎప్పటికీ నిలబడి ఉంటాం. ఈ నెల 21న ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్‌లో సదస్సు నిర్వహిస్తాం’’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని