RS Praveen Kumar: అణచివేత సహించలేకే ఉద్యోగం వదులుకున్నా

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అణచివేత ధోరణి సహించలేకనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 13 Sep 2023 09:03 IST

ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అణచివేత ధోరణి సహించలేకనే తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. లేకుంటే తనకు డీజీపీ పదవి వచ్చి ఉండేదన్నారు. బహుజనులు రాజకీయ బానిసలు కావొద్దని.. రాజ్యాధికారం సాధించుకుందామని పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సుందరయ్య కళానిలయంలో రాష్ట్ర వడ్డెర మహాసభ జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యమకారులపై కేసులు ఉన్నాయని, బడుగులకు రాజకీయ అవకాశాలు కల్పించకుండా అణచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చేతివృత్తిదారులు, నిమ్నజాతులు, అట్టడుగు వర్గాల నుంచి ఎంతమంది ప్రగతిభవన్‌, అసెంబ్లీ మెట్లు ఎక్కారని ప్రశ్నించారు. బహుజనుల రాజ్యాధికారం కోసం నిబద్ధతతో పని చేసేవారికి బీఎస్పీ అండగా ఉంటుందని, వారిని అసెంబ్లీకి పంపే బాధ్యత తీసుకుంటానన్నారు. రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నారు. భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ.. వడ్డెరల సంక్షేమాన్ని విస్మరించిన భారాస సర్కారుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ టెండర్లలో వారికి ఎలాంటి ధరావతు లేకుండా పనులు కేటాయించాలన్నారు. సభలో వడ్డెర సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సమ్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు నగేష్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు దుర్గయ్య,  ప్రధాన కార్యదర్శి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని