యూపీలో దళితుల దన్ను ఎవరికి?

ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో ఎప్పుడూ కులం కీలకపాత్ర పోషిస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువ. నిన్నటిదాకా దళిత కార్డుతో బలమైన రాజకీయశక్తిగా కొనసాగిన బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఈ సారి నామమాత్రపు పోటీదారుగా కనిపిస్తోంది...

Updated : 28 Jan 2022 05:43 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో ఎప్పుడూ కులం కీలకపాత్ర పోషిస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు దాని ప్రభావం మరింత ఎక్కువ. నిన్నటిదాకా దళిత కార్డుతో బలమైన రాజకీయశక్తిగా కొనసాగిన బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) ఈ సారి నామమాత్రపు పోటీదారుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం కైవసం చేసుకోవాలని కమలం పార్టీ.. పునర్వైభవం సాధించాలని అఖిలేశ్‌ యాదవ్‌ గెలుపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. మాయావతి మౌనంతో ఈ రెండు పార్టీల మధ్యే పోటీ కనిపిస్తోంది. ఈ క్రమంలో ఇంతవరకు బలమైన రాజకీయశక్తిగా కొనసాగిన బీఎస్పీకి దన్నుగా నిలిచిన దళితులు ఈసారి ఏ రాజకీయ పక్షానికి మద్దతిస్తారన్నది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  


భాజపా దీర్ఘకాలిక ప్రణాళిక

భాజపా నుంచి ఇటీవల కొంతమంది ప్రముఖ ఓబీసీ నేతలు ఎస్పీ గూటికి చేరటం ద్వారా యూపీ ఎన్నికల్లో దళితులు మరింత కీలకంగా మారారు. ఈ వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు భాజపా పలు వ్యూహాలను అమలుచేస్తోంది. హిందుత్వ కార్డుతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అమలుచేసిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా వారికి చేరువయ్యేందుకు పావులు కదుపుతోంది. యూపీలో దళిత జనాభా 21 శాతం ఉండగా.. అందులో మాయావతి సామాజికవర్గం, దళిత ఉపకులమైన జాతవ్‌లు 55 శాతంగా ఉన్నారు. మాయావతి ఎక్కువగా తన సామాజిక వర్గంపైనే ఆధారపడుతున్నట్లు విశ్లేషకుల అంచనా. 1990లో కాన్షీరామ్‌ సారథ్యంలోని బీఎస్పీ రాజకీయశక్తిగా అవతరించేవరకు యూపీ దళితులు కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు. బ్రాహ్మణులు, దళితులను ఏకం చేసే సోషల్‌ ఇంజినీరింగ్‌ ఫార్ములాతో 2007 ఎన్నికల్లో మాయావతి పూర్తి మెజార్టీతో అధికారం చేపట్టారు. ఆ తర్వాత ఎన్నికల్లో ‘బెహన్‌జీ’ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. యూపీ దళితులపై మాయావతి ఆధిపత్యాన్ని తగ్గించేందుకు భాజపా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తోంది. లోక్‌సభ ఎన్నికల నుంచి ఆ వర్గం వారికి చేరువయ్యేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించటానికి ముందే యూపీలోని 75 జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. జనరల్‌ స్థానాల్లో దళితులకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే రెండోవిడత పోలింగు జరిగే షహరన్‌పూర్‌లో జగ్‌పాల్‌సింగ్‌ను బరిలో దించింది. 107 మంది అభ్యర్థులతో భాజపా ప్రకటించిన తొలి జాబితాలో 19 మంది దళితులు. ఇందులో మాయావతి సామాజికవర్గం జాతవ్‌ వర్గానికి చెందిన 13 మందికి టికెట్లు ఇచ్చారు.


ఓబీసీల ఏకీకరణకే ఎస్పీ మొగ్గు..

ళిత ఓటుబ్యాంకుపై కాషాయదళం గురిపెట్టినప్పటికీ సమాజ్‌వాదీ పార్టీ మాత్రం ఓబీసీల ఏకీకరణకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. యాదవులు - ముస్లింల పార్టీగా గుర్తింపు పొందిన ఎస్పీని.. అఖిలేశ్‌ మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ విశ్లేకులు అభిప్రాయపడుతున్నారు. వెనకబడిన కులాల నేతలను చేర్చుకోవటం దళితులను పార్టీకి చేరువ చేస్తుందని ఎస్పీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిన్నాచితక పార్టీలతో జట్టు కట్టిన అఖిలేశ్‌.. దళిత నేత, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ చంద్రశేఖర్‌ చేసిన పొత్తు ప్రతిపాదనపై కనీసం స్పందించలేదు. దీంతో ఆయన ఎస్పీపై ఆగ్రహంతో ఉన్నారు. ఓబీసీ నేతల చేరికలను ప్రోత్సహించటంతోపాటు ఆజాద్‌ సమాజ్‌ పార్టీతో పొత్తుకు విముఖత చూపటం ద్వారా యూపీలో సరికొత్త సామాజిక సమీకరణాలకు అఖిలేశ్‌ తెర లేపినట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని