Opposition Meet: ‘ఇండియా’ 140కోట్ల మంది కోసమన్న కేజ్రీవాల్‌.. విపక్ష కూటమి నేతల భేటీ ప్రారంభం

ముంబయిలో విపక్ష పార్టీల ‘ఇండియా’ కూటమి నేతల భేటీ మొదలైంది.

Updated : 31 Aug 2023 20:05 IST

ముంబయి: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ఎన్డీయేపై ఉమ్మడి పోరుకు సై అంటోన్న ‘ఇండియా’((I.N.D.I.A) కూటమి మూడో సమావేశం మొదలైంది. ముంబయిలో రెండు రోజుల పాటు జరిగే ఈ కీలక భేటీకి 28 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. భాజపా సారథ్యంలోని ఎన్డీయేను ఎదుర్కొనే వ్యూహాలపై ఈ కీలక భేటీలో చర్చించనున్నారు. అలాగే, ‘ఇండియా’ కూటమి లోగోను ఆవిష్కరించడంతో పాటు సమన్వయ కమిటీ ఏర్పాటు, సంయుక్త కార్యాచరణ ప్రణాళికపై చర్చ తదితర కీలక అంశాలే అజెండాగా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం.

ఈ భేటీకి కాంగ్రెస్‌ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ,  రాహుల్‌ గాంధీతో పాటు వివిధ పార్టీల అధినేతలు శరద్‌పవార్‌ (ఎన్సీపీ), నీతీశ్‌ కుమార్‌(జేడీయూ), లాలూ ప్రసాద్‌యాదవ్‌(ఆర్జేడీ), మమతా బెనర్జీ(తృణమూల్‌ కాంగ్రెస్‌), కేజ్రీవాల్‌(ఆప్‌), ఉద్ధవ్‌ ఠాక్రే (శివసేన-యూబీటీ), ఒమర్‌ అబ్దుల్లా (ఎన్‌సీ), అఖిలేశ్ యాదవ్‌(సమాజ్‌వాదీ పార్టీ), హేమంత్‌సోరెన్‌(జేఎంఎం),  ఎంకే స్టాలిన్‌ (డీఎంకే), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), మహబూబా ముఫ్తీ (పీడీపీ), కృష్ణ పటేల్‌ (అప్నాదళ్‌-కెమెరవాడి), జయంత్‌సిన్హా (ఆర్‌ఎల్డీ), తిరుమవలవన్‌ (విడుదలై చిరుతైగల్‌ కట్చి -వీసీకే) సహా పలు పార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. 

‘ఇండియా’ కూటమి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుంది..

ఈ భేటీకి ముందు పలువురు నేతలు మాట్లాడుతూ.. దేశంలోని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే తామంతా ఏకమైనట్టు ‘ఇండియా’ కూటమి నేతలు అన్నారు.  తామంతా మోదీ సారథ్యంలోని భాజపాను ఎదుర్కొనేందుకు ఉమ్మడి కార్యక్రమాన్ని సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ముంబయిలో భేటీకి ముందు బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మాట్లాడుతూ..  దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని బలోపేతం చేసేందుకు, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఏకమయ్యేందుకు ఇదే సరైన సమయం అన్నారు. పేదరికం, నిరుద్యోగం, రైతుల సంక్షేమం వంటి సమస్యల్ని పరిష్కరించడంలో మోదీ సర్కార్‌ విఫలమైందని మండిపడ్డారు. దేశంలోని యువత ఉపాధిని కోరుకుంటున్నారు, ప్రజలు ద్రవ్యోల్బణం నుండి బయటపడాలని కోరుకుంటున్నారు.. కానీ మోదీ సర్కార్‌ ఒక మనిషికోసమే పనిచేస్తోందని దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కోసమని.. ఇది దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందన్నారు. యువతే దేశానికి బలమని పీడీపీ నేత, కశ్మీర్‌ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ అన్నారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు పాలించిన  నేతలు యువతకు దిశానిర్దేశం చేయడంతో పాటు జేఎన్‌యూ, ఐఐఎంలు, ఇస్రో వంటి సంస్థల్ని స్థాపించేందుకు కృషిచేశారన్నారు.

‘ఇండియా’ కూటమిని చూసి భాజపా భయపడుతోంది.. 

ఒకే ఆలోచన కలిగిన పార్టీలను ఏకం చేసి విపక్ష కూటమి ఏర్పాటు చేసే ఆలోచనను లాలూ, నీతీశ్‌ నిర్ణయించారని.. ఏడాది తర్వాత ఇప్పుడు మూడోసారి ఇండియా కూటమి సమావేశం జరుగుతోందని ఆర్జేడీ నేత, బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌ చెప్పారు.  ప్రజల ఆకాంక్షలను నెరవేర్చకపోతే తమను క్షమించరన్నారు. ఇండియా కూటమిని చూసి భాజపా భయపడుతోందని ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా అన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకు తమ కూటమి పనిచేస్తోందని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా అన్నారు. ఇండియా కూటమికి ప్రజల నుంచి వస్తోన్న స్పందనతో ప్రధాని మోదీ, భాజపా కలవరపడుతున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని