KTR: ఐటీలో 27 ఏళ్లలో జరిగింది.. ఒక్క ఏడాదిలోనే చేసి చూపించాం: కేటీఆర్‌

రాష్ట్రంలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వివరించారు.

Updated : 04 Aug 2023 13:48 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో 2022-23లో ఐటీ ఎగుమతులు 31.4 శాతం మేర పెరిగాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 6లక్షలకు పైగా ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. శాసనసభలో కేటీఆర్‌ మాట్లాడారు. రాష్ట్రంలో భూముల రేట్లు బాగా పెరుగుతున్నాయని.. కోకాపేటలో భూముల ధర రికార్డులు బద్దలు కొట్టిందన్నారు. స్టేబుల్‌ గవర్నమెంట్‌.. ఏబుల్‌ లీడర్‌షిప్‌ వల్లే ఇదంతా సాధ్యమైందని చెప్పారు. కానీ ఇవేమీ పట్టనట్లు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘హైదరాబాద్‌లో ఐటీని మేమే అభివృద్ధి చేశామని కొంతమంది చెప్పుకుంటారు. కానీ మేం అలా చెప్పుకోం. నగరానికి 1987లో మొట్టమొదటి ఐటీ పరిశ్రమ వచ్చింది. బేగంపేటలోని ఇంటర్‌ గ్రాఫ్‌ సంస్థ.. మొట్టమొదటి ఐటీ భవనం. అప్పటి నుంచి 2014 వరకు 27 ఏళ్లలో ఐటీ ఎగుమతులు రూ.56వేల కోట్లు. కానీ గత ఏడాది ఐటీ రంగంలో 57,707 కోట్ల ఎగుమతులు సాధించాం. 27 ఏళ్లలో జరిగింది.. ఇవాళ ఒకే ఒక్క సంవత్సరంలో కేసీఆర్‌ నాయకత్వం చేసి చూపించింది. దక్షత, సమర్థత కలిగిన ప్రభుత్వాలు ఉంటే ఇలాంటి ఫలితాలు వస్తాయి. దేశంలో మొత్తం సృష్టించిన టెక్నాలజీ జాబ్స్‌లో 44 శాతం తెలంగాణవే ఉన్నాయి. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. పట్టణాలు, నగరాలు ఎదగాలంటే పరిశ్రమలను ఆకర్షించాలి. ప్రతి చోటా అంతర్జాతీయ ప్రమాణాలను తట్టుకుని నిలబడాలి’’ అని కేటీఆర్‌ అన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని