Nadendla manohar: ఐబీ సిలబస్‌ అమలుపై సీఎం జగన్‌కు ఎందుకంత తొందర?: నాదెండ్ల మనోహర్‌

ఐబీ సిలబస్‌ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సీఎం జగన్‌ సిద్ధం అవుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు.

Updated : 19 Oct 2023 15:17 IST

కాకినాడ: పేద విద్యార్థుల పేరుతో విద్యాశాఖలో బహిరంగ అవినీతికి ముఖ్యమంత్రి జగన్ తెర లేపారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. తన స్వలాభం కోసం విద్యా శాఖను అక్రమాలకు అడ్డాగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. గురువారం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ - ఐబీ (ఇంటర్నేషనల్ బెకాలారెట్) సిలబస్‌ను పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు చేసుకుంటున్న ఒప్పందం వైకాపా ప్రభుత్వ అవినీతికి నిదర్శనమన్నారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో నాదెండ్ల మాట్లాడారు.

‘‘పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించేందుకు మొన్నటి వరకు ఆంగ్ల మాధ్యమం అని, ఆ తర్వాత సీబీఎస్ఈ సిలబస్ అని మాయ మాటలు చెప్పిన సీఎం.. తాజాగా ఐబీ సిలబస్‌ను బలవంతంగా విద్యార్థులపై రుద్దేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఐబీ కరికులమ్‌ ప్రపంచంలో కేవలం 4 వేల పాఠశాలల్లో మాత్రమే అమలవుతున్న విధానం. దేశం మొత్తం మీద కేవలం 212 పాఠశాలల్లో మాత్రమే ఐబీ సిలబస్ అమలవుతోంది. అలాంటి సిలబస్‌ను రాష్ట్రంలోని 40వేలకు పైగా ప్రభుత్వ స్కూల్స్ లో అమలు చేయడం ఏంటి?
అన్ని పాఠశాల్లలో ఈ సిలబస్‌ను అమలు చేయడానికి ఎందుకంత తొందరపడుతున్నారో ప్రజలకు వివరించాలి. మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఈ సీఎం.. అసలు ఐబీ సిలబస్ వల్ల పేద విద్యార్థులకు ఏం ప్రయోజనమో కూడా చెప్పాలి. విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి వైకాపా ప్రభుత్వం ప్రణాళిక వేస్తున్నట్లు కనిపిస్తోంది’’ అని నాదెండ్ల విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని