ODI World Cup: ప్రపంచకప్‌నకు టీమ్‌ ఇండియా ‘పవర్‌ పేస్‌’ ప్యాక్‌!

భారత్‌ ప్రధాన పేసు గుర్రాలు (Team India Pacers) మాంచి ఊపుమీదున్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాల్లో టీమ్‌ ఇండియాకు ఇంత బలమైన పేస్‌ దళం లభించలేదంటే అశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరికి ఆల్‌రౌండర్లు తోడవ్వడంతో భారత బ్యాటింగ్‌ డెప్త్‌ కూడా పెరిగిపోయింది.

Updated : 05 Oct 2023 11:09 IST

వన్డే క్రికెట్‌ ప్రపంచ సంగ్రామం మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. సమయం దగ్గరపడే కొద్దీ టీమ్‌ ఇండియాకు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. గాయాలబారిన పడిన కీలక ఆటగాళ్లు కోలుకొని మంచి లయను అందుకొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత బలమైన పేస్‌ దళం భారత్‌ తరఫున సిద్ధమైంది. పిచ్‌ కండీషన్‌ను బట్టి ముగ్గురు నుంచి నలుగురు పేసర్లతో భారత్‌ బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బుమ్రా, సిరాజ్‌, షమీ, పాండ్య, శార్దూల్‌తో కూడిన ప్రపంచంలోనే ‘ది బెస్ట్‌’ అని చెప్పదగ్గ సీమ్‌ దళం బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఫాస్ట్‌ బౌలింగ్‌ అంటే వెస్టిండీస్‌ గుర్తుకొచ్చేది. ఆ తర్వాత పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. అద్భుతమైన బౌలర్లను తయారు చేసుకొన్నాయి. ఇప్పుడు భారత్‌ కూడా ఆ స్థాయి బౌలింగ్‌ను సిద్ధం చేసుకుంది.

ఆసియా పులులతో జాగ్రత్త..!

ముఖ్యంగా పచ్చికతో కళకళలాడే సెనా (SENA) పిచ్‌లపై సీమర్లు అలవోకగా వికెట్లు సాధిస్తారు. కానీ, బ్యాటింగ్‌, స్పిన్‌కు అనుకూలించే ఉపఖండం పిచ్‌లపై వికెట్లు తీయడం చాలా కష్టం. ఇక్కడ బౌన్స్‌, సీమ్‌ రాబట్టడం కత్తిమీద సామే. హేజిల్‌వుడ్‌ వంటి నాణ్యమైన ఆసీస్‌ బౌలర్‌ ఈ పిచ్‌లపై 8 మ్యాచ్‌ల్లో 6 వికెట్లే తీశాడు. టిమ్‌ సౌథీ కూడా ఆసియాలో 40 మ్యాచ్‌లు ఆడి కేవలం 58 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా మంది పేసర్లు ఉపఖండం పిచ్‌లపై చేతులెత్తేశారు. ఇక మన సిరాజ్‌ వన్డే కెరీర్‌లో 24 మ్యాచ్‌ల్లో 43 వికెట్లు తీయగా.. ఉపఖండంపై 17 మ్యాచ్‌ల్లో 35 వికెట్లను కూల్చి ప్రత్యర్థి శిబిరాల్లో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాడు. అతడి ఎకానమీ కేవలం 4.5 కావడం విశేషం. ఇక షమీ కెరీర్‌లో తీసిన 162 వికెట్లలో 64 (39 మ్యాచ్‌ల్లో) ఆసియా పిచ్‌లపై సాధించినవే. బుమ్రా కూడా కేవలం 37 మ్యాచ్‌ల్లోనే 4.65 ఎకానమీతో 63 వికెట్లను కూల్చాడు. పాక్‌ బౌలర్లు షహీన్‌ అఫ్రిదీ, హారిస్‌ రవూఫ్‌కు కూడా ఆసియా పిచ్‌లపై మెరుగైన రికార్డు ఉంది.

పవర్‌ప్లేలో భయపెడుతున్న సిరాజ్‌..!

జట్టు భారీ స్కోర్లు చేయాలంటే ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వడం ముఖ్యం. కానీ, ఇటీవల కాలంలో ప్రత్యర్థి ఓపెనర్లు కుదురుకోనివ్వకుండా భారత్‌ చేస్తోందంటే... మన పేసర్ల సత్తా ఏమిటో అర్థమవుతుంది. 2022 నుంచి ఇప్పటివరకు టీమ్‌ ఇండియా ఆడిన 42 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 80 వికెట్లను పవర్‌ ప్లేలోనే కూల్చింది. అంటే ప్రతి మ్యాచ్‌లో సగటున 1.90 వికెట్లు పడగొట్టింది. భారత్‌ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్‌ (1.80), న్యూజిలాండ్‌ (1.70), పాకిస్థాన్‌ (1.70) ఉన్నాయి. 

హైదరాబాదీ మియా భాయ్‌ సిరాజ్‌ ఇటీవల కాలంలో ప్రత్యర్థి ఓపెనర్లకు పీడకలగా మారాడు. 2022 నుంచి అతడు పవర్‌ప్లేలో మొత్తం 132 ఓవర్లు వేసి.. 32 వికెట్లు తీశాడు. అంతేకాదు.. పొదుపుగా 4.16 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. 2023లో అయితే 13 ఇన్నింగ్స్‌ల్లో 16 వికెట్లు తీశాడు. ఆసియా కప్‌ ఫైనల్‌లో శ్రీలంక ఇన్నింగ్స్‌ను పవర్‌ ప్లేలోనే పేకమేడలా కూల్చేశాడు.

షమీ - బుమ్రా లెక్కే వేరు..

మరో పేసర్‌ షమీ హ్యాట్రిక్‌ వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది షమీ భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. మొత్తం 12 ఇన్నింగ్స్‌లు ఆడి.. 19 వికెట్లను కూల్చాడు. వీటిల్లో తన కెరీర్‌లోనే అత్యున్నత గణాంకాలైన 5/51ని దేశీయ పిచ్‌ మీద ఆస్ట్రేలియాపై నమోదు చేశాడు. ముఖ్యంగా షమీ గత ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అద్భుత బౌలింగ్‌ గణాంకాలను నమోదు చేశాడు. 2015, 2019 ప్రపంచకప్‌ల్లో ఆడి మొత్తం 11 మ్యాచ్‌ల్లో 31 మంది బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. ప్రపంచకప్‌ టోర్నీలో అతడి బెస్ట్‌ 5/69. వాస్తవానికి షమీ బౌలింగ్‌ యావరేజి 25.50. కానీ, ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించి కేవలం 15.70 సగటును నమోదు చేశాడంటే అతడి బౌలింగ్‌ పదును అర్థం చేసుకోవచ్చు.

గాయం కారణంగా ఏడాది పాటు సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న బుమ్రా ఇటీవలే పాకిస్థాన్‌పై మ్యాచ్‌లో తిరిగి వన్డేల్లోకి అడుగుపెట్టాడు. తనలో పదును ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకొన్నాడు. ఈ ఏడాది మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి.. ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. ప్రపంచకప్‌లో ఈ పేసు గుర్రానికి ఘనమైన రికార్డే ఉంది. 2019 మెగా టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి.. 18 వికెట్లను కుప్పకూల్చాడు. అంటే మ్యాచ్‌కు సగటున రెండు వికెట్లు అన్నమాట. బంగ్లాదేశ్‌, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్‌, సౌతాఫ్రికాపై విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో బుమ్రా కెరీర్‌ సగటు 20గా ఉంది. అతని మొత్తం కెరీర్‌ సగటు రేటు 24.31 కావడం గమనార్హం.

రెండు వైపులా పదునున్న కత్తులతో పెరిగిన బ్యాటింగ్‌ డెప్త్‌..

మన సీమర్ల గణాంకాలు విశ్లేషకులను పునరాలోచనలో పడేస్తున్నాయి. మూడో స్పెషలిస్టు పేసర్‌ను కూడా జట్టులో ఉంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే హార్దిక్‌ రూపంలో మీడియం పేస్‌ ఆల్‌రౌండర్‌ జట్టులో ఉండనే ఉన్నాడు. దీంతో స్పెషలిస్టు సీమర్లలో ఒకరిని బెంచ్‌కు పరిమితం చేసి మరో స్పెషలిస్టు బ్యాటర్‌కు అవకాశం కల్పించే వెసులుబాటు రోహిత్‌కు లభిస్తుంది.

ప్రపంచ కప్‌లో మాహీ... ఎందుకంత స్పెషల్‌ అంటే!

ఒక వేళ పిచ్‌ స్వింగ్‌కు అనుకూలిస్తుంది అనుకుంటే.. ముగ్గురు స్పెషలిస్టు సీమర్లను బరిలోకి దించినా.. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉంటారు. ఇక మిడిల్‌, లోయర్‌ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి ఆల్‌ రౌండర్స్‌ ఉంటారు. పేసర్లు కూడా చివర్లో తనదైన శైలిలో హార్డ్‌ హిట్టింగ్‌ చేస్తే.. ఆఖరి బ్యాటర్‌ వరకు పరుగులు సాధించే అవకాశం ఉంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని