BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ ముందున్న మార్గమేంటి?

Eenadu icon
By Editorial Team Published : 03 Nov 2025 02:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
4 min read

భారత టెలికాం రంగం ఆర్థిక వ్యవస్థకు కీలక చోదక శక్తి. ఇది దేశ జీడీపీకి సుమారు ఆరుశాతందాకా అందిస్తోంది. ఈ రంగం ప్రత్యక్షంగా సుమారు 22 లక్షల మందికి, పరోక్షంగా మరో 18 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నాలుగు లక్షల మంది ఉద్యోగులు, రూ.40 వేల కోట్ల మిగులుతో పాతికేళ్ల క్రితం ఏర్పడటం ఒక చరిత్ర. తరవాతి కాలంలో మెరుగైన స్థితి నుంచి కిందికి జారింది. రజతోత్సవాన్ని పూర్తి చేసుకున్న వేళ బీఎస్‌ఎన్‌ఎల్‌ భవిష్యత్తుపై విశ్లేషణ అవసరం.

ప్రైవేట్‌ టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్‌ ఎయిర్‌టెల్‌ 1995లో ప్రవేశించి 2014లో 4జీ సేవలను ప్రారంభించింది. రిలయన్స్‌ జియో 2016లో దేశవ్యాప్తంగా 4జీ ఎల్‌టీఈ పరిజ్ఞానంతో అడుగుపెట్టింది. వొడాఫోన్‌ ఐడియా 2019 నాటికి ప్రధాన సర్కిళ్లలో 4జీ నెట్‌వర్క్‌ ఏకీకరణను సాధించింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ పనితీరును జియో, ఎయిర్‌టెల్‌లతో పోల్చలేం. 4జీ అప్‌గ్రేడేషన్‌లో దశాబ్ద కాలం వెనుకంజలో ఉండటం వల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ మార్కెట్‌ వాటా గణనీయంగా తగ్గింది. అయితే, టెలికాం రంగం అంతరిక్షం, యుద్ధతంత్రంతో పాటు ఇతర కీలక సాంకేతికతలతో ముడిపడి ఉన్నందువల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌ను కేవలం వాణిజ్య పోటీలో భాగంగా చూడకూడదు. వ్యూహాత్మక, సైబర్‌ భద్రత రంగాల్లో సంస్థ సేవలను వాడుకోవాలి. సుమారు 80 కోట్ల స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు, పటిష్టమైన వేదికల ద్వారా అవాంతరాలు లేని చెల్లింపులతో, భారత డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ విలువ లక్ష కోట్ల డాలర్లను దాటబోతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌లోని యువ సిబ్బందిని వ్యూహాత్మక సైబర్‌ భద్రత నియంత్రణ కోసం వినియోగించాలి. సమర్థులు, ప్రతిభావంతులైన ఇంజినీర్లను ఎంపిక చేసి, నిపుణులతో శిక్షణ ఇప్పించి సైబర్‌ క్రైమ్‌ యోధులుగా తీర్చిదిద్దాలి.

మౌలిక సదుపాయాల కోసం...

స్పెక్ట్రమ్‌ అనేది కంపెనీ ఆస్తి కాదు. అది ఒక లైసెన్స్‌. అలాంటప్పుడు ఒక కంపెనీకి జారీ చేసిన లైసెన్స్‌ మరొకరితో పంచుకోవడం లేదా అమ్మడం ఎలా సాధ్యమవుతుంది? దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ విధానాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. స్పెక్ట్రమ్‌కు పూర్తి యజమానిగా ప్రభుత్వమే ఉన్నందువల్ల దాని లీజు, అమ్మకం, మూడోపక్షానికి తాకట్టు పెట్టడం అనుమతించకూడదు. టెలికాం రంగం సంరక్షణనూ బీఎస్‌ఎన్‌ఎల్‌ పర్యవేక్షించవచ్చు. 2025 జులైలో ప్రభుత్వం విడుదల చేసిన ముసాయిదా జాతీయ టెలికాం పాలసీ-2025 ఇతర విషయాలతో పాటు, కొత్త ఉద్యోగాలను సృష్టించడం, భవిష్యత్‌ డిమాండ్‌ను తీర్చడానికి కార్మికుల నైపుణ్యాలను పెంచడం తదితర లక్ష్యాలను ప్రకటించింది. వీటిని చేరుకోవడంతో పాటు తరవాతి తరం సాంకేతికతలలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘సీడాట్‌’ సంస్థను అత్యుత్తమ టెలికాం పరిశోధక, అభివృద్ధి సంస్థగా మార్చాలని పేర్కొంది. డీవోటీ/ బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆధ్వర్యంలో గాజియాబాద్‌లో అడ్వాన్స్‌డ్‌ లెవల్‌ టెలికాం ట్రైనింగ్‌ సెంటర్, జబల్‌పూర్‌లో భారతరత్న బీఆర్‌ అంబేడ్కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెలికాం ట్రైనింగ్‌ ఉన్నాయి. ఈ రెండూ అంతర్జాతీయ స్థాయి శిక్షణా కేంద్రాలు. ఇవి అత్యంత నైపుణ్యం, అనుభవం ఉన్న నిపుణుల బృందంతో ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణను అందిస్తాయి. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంతరాన్ని తగ్గించడానికి అత్యాధునిక మౌలిక సదుపాయాలు కలిగి ఉన్నాయి. టెలికాం సాఫ్ట్‌వేర్, మేనేజ్‌మెంట్‌ రంగంలో పారిశ్రామిక శిక్షణ, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్, కార్పొరేట్‌ శిక్షణను అందిస్తాయి. దేశవ్యాప్తంగా సుమారు డజను రీజినల్‌ టెలికాం ట్రైనింగ్‌ సెంటర్లు ఉన్నాయి. అయితే, 2025 ఆగష్టులో పొదుపు చర్యలలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ తన శిక్షణా కేంద్రాల్లోని సిబ్బందికి శిక్షణా భత్యాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఇలాంటి చర్యలకు దిగడానికి బదులుగా, తన లక్ష్యాల సాధనలో భాగంగా, అనుభవజ్ఞులతో కూడిన మౌలిక సదుపాయాలను మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు.

నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహణ

ఆర్థిక విశ్లేషకుల నివేదికల ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ కార్పొరేట్లు రూ.16.5 లక్షల కోట్ల లాభాలను నమోదు చేశాయి. వాటిలో రూ.5.15 లక్షల కోట్లు ప్రభుత్వరంగ సంస్థల నుంచి సమకూరాయి. అంటే, సమాన అవకాశాలు కల్పిస్తే వస్తువులు, సేవల రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మెరుగ్గా రాణించగలవు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ స్వతంత్ర ఇంజినీరింగ్‌ నిపుణుల ఆధ్వర్యంలో నడిస్తేనే ఆధునిక పరిజ్ఞానాలతో నాణ్యమైన సేవలను అందించడంలో ప్రైవేట్‌ సంస్థలతో పోటీ పడగలదు. ఈ విషయంలో ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ను విపత్తు సాయం, సార్వజనిక సేవా ప్రయోజనాలు, వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ అవసరాలు వంటి కీలక బాధ్యతల కోసం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాంలో ఒక భాగంగా చూడాలి. శిక్షణ పొందిన ఇంజినీర్లను వదిలించుకోవాలనే ఆలోచనలను వీడాలి. ఉద్యోగుల వేతన సవరణను లాభాలతో ముడిపెట్టకూడదు. అప్పుడే బీఎస్‌ఎన్‌ఎల్‌ మెరుగైన పనితీరుతో ప్రజలకు సేవలు అందించగలదు.


కేసుల గుట్ట కరిగేదెలా?

ఈ ఏడాది జూన్‌ నాటికి ఇండియాలోని సబార్డినేట్‌ కోర్టుల్లో నాలుగున్నర కోట్లకు పైగా కేసులు పెండింగులో మూలుగుతున్నాయి. అన్ని కోర్టుల్లోని మొత్తం కేసుల్లో ఇవి దాదాపు 87శాతం. ఈ కేసులు వీలైనంత వేగంగా పరిష్కారం కావాలంటే జడ్జిలు పూర్తిస్థాయిలో ఉండాలి. అయితే, ఈ సంవత్సరం ఆరంభం నాటికి ఏపీ సబార్డినేట్‌ కోర్టుల్లో 11.7శాతం, తెలంగాణలో 20.5శాతం పోస్టులు భర్తీకి నోచుకోకుండా ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పావు శాతానికి పైగా ఖాళీగా ఉన్నాయి. ఆ రాష్ట్రాలు, ఖాళీలు... (శాతాల్లో) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.