లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్‌మిల్‌.. ఆరేళ్ల బాలుడి మృతి

USA: ఓ ఆరేళ్ల బాలుడిని అతడి తండ్రి ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరిగెత్తించడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అగ్రరాజ్యంలో జరిగిన ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 02 May 2024 16:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ తండ్రి విపరీత చర్య వల్ల ఆరేళ్ల కుమారుడు మృత్యుఒడికి చేరాడు. కన్న కొడుకు లావుగా ఉన్నాడని భావించిన ఆ వ్యక్తి ట్రెడ్‌మిల్‌ (Treadmill)పై బలవంతంగా పరిగెత్తించాడు. బాలుడి వయసును కూడా చూడకుండా వేగాన్ని విపరీతంగా పెంచాడు. దీంతో అభంశుభం తెలియని ఆ బాలుడు గాయాలపాలై కొన్ని రోజులకు ప్రాణాలు విడిచాడు. అమెరికా (USA)లో మూడేళ్ల క్రితం జరిగిన ఈ విషాదకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు విచారణ కారణంగా వెలుగులోకి వచ్చాయి.

కుమారుడి మృతికి కారణమయ్యాడన్న అభియోగాలపై న్యూజెర్సీకి చెందిన క్రిస్టోఫర్‌ గ్రెగర్‌ 2021లో అరెస్టయ్యాడు. ఈ కేసుకు సంబంధించి తాజాగా కోర్టులో విచారణ జరగ్గా.. బాలుడి మృతికి కారణమైన ట్రెడ్‌మిల్‌ పరుగు దృశ్యాలను సాక్ష్యాలుగా న్యాయస్థానంలో ప్రదర్శించారు. ఆ ఏడాది మార్చి 20న క్రిస్టోఫర్‌ తన కుమారుడు కోరీని తీసుకుని స్థానికంగా ఉన్న ఓ ఫిట్‌నెస్‌ సెంటర్‌కు తీసుకెళ్లాడు.

గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు

బాలుడు లావుగా ఉన్నాడని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తించాడు. అతడికి కష్టంగా అనిపిస్తున్నా సరే వేగాన్ని చాలా పెంచాడు. దీంతో ఆ బాలుడు పలుమార్లు కిందపడిపోయాడు. అయినప్పటికీ ఆగకుండా ఆ తండ్రి బలవంతంగా తన కొడుకును ట్రెడ్‌మిల్‌ ఎక్కించాడు. వద్దని చెబితే కొట్టాడు. కొన్ని రోజులకు అతడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో 2021 ఏప్రిల్‌ 1న బాలుడిని తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.

ఆ మరుసటిరోజే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. స్కానింగ్‌లో అతడి అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలైనట్లు తేలింది. గుండె, కాలేయంపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందుల కారణంగా అతడు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదే ఏడాది జులైలో క్రిస్టోఫర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో ఈ దృశ్యాలను చూసి బాలుడి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ కేసులో అతడికి జీవితఖైదు పడే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని