Goldy Brar: గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు

కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. 

Updated : 02 May 2024 10:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ (Goldy Brar) అమెరికా(USA)లోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. వాస్తవానికి ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తి వివరాలను గుర్తించిన తర్వాత ఈ ప్రకటన చేశారు. 

అమెరికాలోని హోల్ట్‌అవెన్యూలో మంగళవారం సాయంత్రం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడు కెనడా కేంద్రంగా పనిచేసే గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌గా స్థానిక మీడియా పేర్కొంది. చివరికి ఫ్రెస్నో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. మృతుడు గోల్డీబ్రార్‌ కాదని  లెఫ్టినెంట్‌ విలియం జే డూలే వెల్లడించారు. ‘‘మీరు ఆన్‌లైన్‌లో ప్రచారం నమ్మి మృతుడు గోల్డీబ్రార్‌ అనుకుంటే కచ్చితంగా తప్పే. అది పూర్తి అవాస్తవం. మా డిపార్ట్‌మెంట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి ఎంక్వైరీలు వస్తున్నాయి. అసలు ఇలాంటి వదంతులు ఎలా మొదలయ్యాయో తెలియదు. ఈ కాల్పుల ఘటనలో మరణించింది 37 ఏళ్ల జేవియర్‌ గాల్డ్నె’’ అని వెల్లడించారు. 

గోల్డీ బ్రార్‌గా ప్రచారంలో ఉన్న సతీందర్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్‌వాంటెడ్‌ క్రిమినల్‌. అతడు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో అత్యంత కీలకమైన సభ్యుడు. 2022లో జరిగిన సిద్ధూ మూసేవాల హత్య కేసులో ఒక్కసారిగా ఇతడి పేరు మార్మోగింది.

మరోవైపు బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ ఇంటిపైకి కాల్పులు జరిపిన ఘటనలో కూడా గోల్డీబ్రార్‌ పేరు వినిపించింది. ఈ కేసులో  అరెస్టైన నిందితుల్లో ఒకరు నిన్ననే పోలీసు కస్టడీలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. నిందితులకు ఆయుధాలు సరఫరా చేసినట్లు భావిస్తున్న అనూజ్‌ తపన్‌ అనే వ్యక్తిని గత నెల 26న పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం అతడు లాకప్‌ గదిలో ఉన్న మరుగుదొడ్డిలో దుప్పటితో ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. మరుగుదొడ్డి నుంచి అనూజ్‌ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు తలుపులు బద్దలుకొట్టి చూడగా అతడు అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని