డిగ్రీలో ఏ కోర్సు మెరుగు?

మీకు ఇంటర్మీడియట్‌లో 85 శాతం మార్కులు వచ్చాయి కాబట్టి బీకాంలో అడ్మిషన్‌ తీసుకొని, చార్టెడ్‌ అకౌంటెన్సీ చేయవచ్చు. లేకపోతే బీకాంలో బిజినెస్‌ అనలిటిక్స్‌, కంప్యూటర్‌కు సంబంధించిన స్పెషలైజేషన్స్‌ ఎంచుకోవచ్చు.

Published : 09 May 2024 00:49 IST

ఇంటర్‌ (సీఈసీ) 850 మార్కులతో పూర్తిచేశాను. డిగ్రీలో ఏ కోర్సు తీసుకుంటే ఉద్యోగావకాశాలు బాగుంటాయి?

- కోడూరి లక్ష్మీలావణ్య

మీకు ఇంటర్మీడియట్‌లో 85 శాతం మార్కులు వచ్చాయి కాబట్టి బీకాంలో అడ్మిషన్‌ తీసుకొని, చార్టెడ్‌ అకౌంటెన్సీ చేయవచ్చు. లేకపోతే బీకాంలో బిజినెస్‌ అనలిటిక్స్‌, కంప్యూటర్‌కు సంబంధించిన స్పెషలైజేషన్స్‌ ఎంచుకోవచ్చు. బీబీఏలో జనరల్‌, బ్యాంకింగ్‌, రిటైలింగ్‌, సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్‌, ఈ-కామర్స్‌, టూరిజం, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్స్‌ కూడా చదవొచ్చు. ఆసక్తి ఉంటే బీఏలో ఇంగ్లిష్‌ లిటరేచర్‌, సైకాలజీ, జర్నలిజం, ఎకనమిక్స్‌ లాంటి సబ్జెక్టుల గురించి కూడా ఆలోచించవచ్చు. ఇవేకాకుండా, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ కానీ ఇంటిగ్రేటెడ్‌ బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ/ బీబీఏ ఎల్‌ఎల్‌బీ/ బీఏ ఎల్‌ఎల్‌బీ కూడా చదివే అవకాశం ఉంది. పైన చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్‌లో ఉద్యోగావకాశాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైనా ఉద్యోగ ప్రయత్నాల్లో విద్యార్హత పాస్‌పోర్ట్‌ లాంటిది. నైపుణ్యాలు వీసా లాంటివి. నైపుణ్యాలు లేకుండా ఉద్యోగం పొందడం కష్టం. మీరు ఏ డిగ్రీ చదివినా, ఎంఎస్‌ ఎక్సెల్‌, పైతాన్‌, స్టాటిస్టిక్స్‌ లాంటి వాటిలో ప్రావీణ్యం ఉంటే, ఉద్యోగా వకాశాలు మెరుగ వుతాయి.


రెగ్యులర్‌ పీజీకి వీలుంటుందా?

అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో బీఏ తెలుగు (సాహిత్యం) 2023లో పాసయ్యాను. రెగ్యులర్‌గా ఎంఏ తెలుగు చేయొచ్చా? సీపీజీఈటీ రాయడానికి అర్హత ఉంటుందా?

- టి.వంశీకృష్ణ

అండర్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ/ ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ/ మరేదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి దూరవిద్య ద్వారా చదివినా, ఆన్‌లైన్‌ పద్ధతిలో చదివినా రెగ్యులర్‌ పీజీ చేసే అవకాశం ఉంది. మీరు నిరభ్యంతరంగా సీపీజీఈటీ (కామన్‌ పీజీ ఎంట్రన్స్‌ టెస్ట్‌) రాయవచ్చు. సీపీజీఈటీలో మంచి ర్యాంకు పొందితే యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, బనారస్‌ హిందూ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్శిటీల నుంచి ఎంఏ తెలుగు చదివే అవకాశం ఉంది. సీపీజీఈటీతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు నిర్వహించే పీజీ ఎంట్రన్స్‌ పరీక్షలు కూడా రాస్తే, రెండు రాష్ట్రాల్లో ఉన్న స్టేట్‌ యూనివర్సిటీల్లో కూడా ఎంఏ చదవొచ్చు.

ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని