మనది నాలుగో స్థానం

రియల్‌ ఎస్టేట్‌ రంగంలో విస్తరిస్తున్న గోదాముల మార్కెట్‌లో హైదరాబాద్‌ వాటా క్రమేణా పెరుగుతోంది.

Published : 11 Nov 2023 01:24 IST

గోదాముల లీజుల్లో వృద్ధి

ఈనాడు, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో విస్తరిస్తున్న గోదాముల మార్కెట్‌లో హైదరాబాద్‌ వాటా క్రమేణా పెరుగుతోంది. జీఎస్‌టీ తర్వాత నుంచి వీటి నిర్మాణంలో వేగం పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధభాగంలో 2.71 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్‌ కార్యకలాపాలు జరిగాయి. దేశవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్‌ వాటా 12 శాతంగా ఉందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా ‘ఇండియా వేర్‌ హౌసింగ్‌ రిపోర్ట్‌’లో పేర్కొంది. ఆరు నెలల్లో అద్దెల వృద్ధి 2 శాతంగా నమోదైందని తెలిపింది.

దేశవ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకు గోదాముల లీజింగ్‌ లావాదేవీలు 23 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకున్నాయి. ఇందులోనూ గ్రేడ్‌-ఏ రకానికి అధిక డిమాండ్‌ ఉంది. వీటి వాటా 53 శాతంగా ఉంది.

  • పుణె నగరం గోదాముల నిర్మాణం, లీజింగ్‌లో ముందు వరసలో ఉంది. 19 శాతం వాటా కలిగి ఉంది. ఆటోమోటివ్‌ పరిశ్రమ కారణంగా ఇక్కడ గోదాములకు డిమాండ్‌ నెలకొంది.
  • ముంబయి 16 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఇక్కడ థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ హబ్‌గా ఉండటంతో గోదాములకు గిరాకీ ఉంది.  

వేటికోసం వీటిని ఉపయోగిస్తున్నారు?

గోదాములను వేర్వేరు అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇదివరకు ఇతర ఉత్పత్తి రంగంలో వీటి వాటా 30 శాతం ఉంటే ఈ ఏడాది అది కాస్తా 47 శాతానికి పెరిగింది.

  • థర్ట్‌ పార్టీ లాజిస్టిక్స్‌ లీజింగ్‌లో కొంత తగ్గుదల నమోదైంది. గత ఏడాది 39 శాతం ఉండగా.. ఈసారి 30 శాతానికి పడిపోయింది.
  • రిటైల్‌ కోసం 6 శాతం, ఈ కామర్స్‌ కోసం 5 శాతం, ఎఫ్‌ఎంసీడీ 4 శాతం, ఎఫ్‌ఎంసీజీ 2 శాతం, ఇతర అవసరాలకు 6 శాతం వినియోగిస్తున్నారు.  

అద్దెలు ఎలా ఉన్నాయ్‌  

గోదాముల లీజింగ్‌లో అధిక వాటా కలిగి ఉన్న పుణెలోనే అద్దెలు సైతం అధికంగా ఉన్నాయి. సగటున నెలకు చదరపు అడుగుకు ఇక్కడ రూ.25.9 ఉంది. తర్వాతి స్థానంలో కోల్‌కతా రూ.23.6,  ముంబయి రూ.23.4 అద్దెలు ఉన్నాయి. హైదరాబాద్‌లో నెలకు సగటున చదరపు అడుగు అద్దె రూ.20 ఉంది. మన దగ్గర మేడ్చల్‌, శంషాబాద్‌, పెద్ద అంబర్‌పేట ప్రాంతాల్లో గోదాములు ఎక్కువగా ఉన్నాయి. అహ్మదాబాద్‌లో తక్కువగా రూ.17 అద్దె వసూలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని