సర్కారీ లేఅవుట్లు..

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని భూ సమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌) ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరం అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటి విస్తరిస్తుండటంతో కొత్త ఆవాసాలకు భూమి లభ్యత చాలా కీలకం.

Updated : 10 Feb 2024 09:23 IST

ల్యాండ్‌ పూలింగ్‌ను కొనసాగించేందుకు సుముఖత

అవుటర్‌ చుట్టూ 924.28 ఎకరాల్లో అభివృద్ధి

 

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని భూ సమీకరణ (ల్యాండ్‌పూలింగ్‌) ప్రాజెక్టుపై ముందుకే వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. నగరం అవుటర్‌ రింగ్‌ రోడ్డు దాటి విస్తరిస్తుండటంతో కొత్త ఆవాసాలకు భూమి లభ్యత చాలా కీలకం. అంతేగాక స్థిరాస్తి రంగానికీ కొత్త ఊపు  రానుంది. ఈ నేపథ్యంలో ల్యాండ్‌ పూలింగ్‌ కొనసాగించాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఈ పథకంపై కొంత సందిగ్ధత నెలకొన్నప్పటికీ... పలు కారణాలతో ముందుకే వెళ్లనుంది. హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి సంబంధిత బాధ్యతలను కేటాయిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఈనాడు, హైదరాబాద్‌

మహానగరం చుట్టూ ఉన్న గ్రామాల్లో.. ముఖ్యంగా బాహ్యవలయ రహదారి వెలుపల రైతులకు సంబంధించిన భూములను వారి ఇష్టంతోనే సమీకరించి లేఅవుట్లు వేసేందుకు హెచ్‌ఎండీఏ గతంలోనే శ్రీకారం చుట్టింది. తొలుత ఇన్ముల్‌నెర్వలో 95.25 ఎకరాలు, లేమూరులో 83.48 ఎకరాల్లో లేఅవుట్‌ అభివృద్ధి పనులు ప్రారంభించింది. ఇప్పటికే లేమూరులో రహదారులు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నారు. ఇన్ముల్‌నెర్వలో భూముల సేకరణ ఒక కొలిక్కి వచ్చింది. మిగతా ప్రాంతాల్లోనూ అధికారులు రైతులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇంతలోనే ఎన్నికలు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ల్యాండ్‌ పూలింగ్‌, లేఅవుట్ల అభివృద్ధి, విక్రయాలతో సర్కారుకు ఆదాయం సమకూరే అవకాశం ఉండటంతో కొత్త ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తమైంది. ఈ క్రమంలో తదుపరి కార్యాచరణను అధికారులు చేపట్టారు.

పరస్పర ప్రయోజనంగా..

హెచ్‌ఎండీఏ లేఅవుట్ల కోసం గుర్తించిన భూములన్నీ దాదాపు సాగులో లేనివే. ఆయా ప్రాంతాల్లో భూములు అసైన్డ్‌ కేటగిరిలో ఉండటంతో రైతులతో మాట్లాడి వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వారి నుంచి సమీకరించిన భూమిని హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తుంది. లేఅవుట్‌ కింద తీర్చిదిద్దుతుంది. రహదారులు, భూగర్భ డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ ఇలా సకల సౌకర్యాలు కల్పించనుంది. అభివృద్ధి చేసిన భూమిలో రైతులకు 60 శాతం బదిలీ చేస్తుంది. మిగతా 40 శాతం హెచ్‌ఎండీఏ విక్రయిస్తుంది. ల్యాండ్‌ పూలింగ్‌లో భాగంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో దాదాపు 924.28 ఎకరాలను అధికారులు పరిశీలించారు.  

ప్రణాళికాబద్ధమైన ప్రగతి సాగేలా..

నగరంలో జనావాసాలు పెరగడంతో అవుటర్‌ రింగ్‌ రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు మధ్య కొత్త ప్రాంతాల అభివృద్ధి అవశ్యంగా మారింది. సిటీపై ఒత్తిడి తగ్గించేందుకు నివాస సముదాయాలు, విల్లాలు, వాణిజ్య, వ్యాపార సముదాయాలు, శాటిలైట్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం తప్పనిసరి. అయితే అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు అందుబాటులో లేవు. దీనిని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయానికి పనికిరాని భూములను రైతుల సమ్మతితో సమీకరించి లేఅవుట్ల కింద అభివృద్ధి చేసి విక్రయించడం ద్వారా ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఆ ప్రాంతాల్లో స్థిరాస్తి రంగానికీ ఊపు తెచ్చినట్లు అవుతుందని పేర్కొంటున్నారు.

అందుబాటు ధరల్లో..

స్థలాల ధరలు భారీగా పెరగడంతో హెచ్‌ఎండీఏ ప్లాట్లు మధ్యతరగతి, సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయాయనే విమర్శలు ఉన్నాయి. గతంలో హెచ్‌ఎండీఏ వేలం వేసినప్పటికీ అవి సామాన్యులకు అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో నగరానికి కొంత దూరంగా అవుటర్‌ రింగ్‌రోడ్డు, ప్రాంతీయ రింగురోడ్డు మధ్య లేఅవుట్లు వేలం వేయడం ద్వారా మధ్యతరగతి ప్రజలకూ ధరలు అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు.  150 గజాలు, 200 గజాల నుంచి ఆపైన పరిమాణంలో ప్లాట్లను సిద్ధం చేసే అవకాశం ఉంది. అటు రీజినల్‌ రింగ్‌రోడ్డు, ఇటు అవుటô మధ్య లేఅవుట్లు రానుండటంతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చాలామంది ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ఆస్కారం ఉండనుంది. ఇందులో భాగంగానే చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపూర్‌లో 355 ఎకరాలు, బోగారంలో 125 ఎకరాలు, ప్రతాప్‌సింగారంలో 152 ఎకరాలు, నాదర్‌గుల్‌లో మరో 91 ఎకరాలను లేఅవుట్లుగా తీర్చిదిద్దనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని