Cyclone Montha: 1,000 బృందాలు, 12 వేల మంది సిబ్బంది

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 28 Oct 2025 06:18 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు ఏర్పాట్లు 
తుపాను నేపథ్యంలో విద్యుత్‌శాఖ ప్రత్యామ్నాయ చర్యలు
ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎస్‌ విజయానంద్‌ 

ఈనాడు, అమరావతి: మొంథా తుపాను కారణంగా విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు తలెత్తితే యుద్ధప్రాతిపదికన మరమ్మతులు నిర్వహించేందుకు విద్యుత్‌శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ప్రభావిత ప్రాంతాలకు అవసరమైన మెటీరియల్, సిబ్బందిని ముందస్తుగా తరలించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా జెనరేటర్లు, సమాచారం అందించేందుకు వాకీటాకీలను అందుబాటులో ఉంచింది. డిస్కంల పరిధిలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. విపత్కర పరిస్థితుల్లోనూ విద్యుత్‌ పనులు నిర్వహించేందుకు వీలుగా ఎక్కడికక్కడ ప్రైవేటు కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించారు. రాబోయే 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్‌ సంస్థల్లో పనిచేసే సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మూడు డిస్కంల పరిధిలో సరఫరా పునరుద్ధరణ పనులకు 1,000 బృందాలు.. సుమారు 12 వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. 

ఈపీడీసీఎల్‌లో అధిక ప్రభావం

వాతావరణ శాఖ నివేదికల మేరకు తుపాను ప్రభావం ఈపీడీసీఎల్‌ పరిధిలో ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ దృష్ట్యా ప్రభావం తక్కువగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌ నుంచి మెటీరియల్, సిబ్బందిని అక్కడికి పంపారు. ఉమ్మడి విశాఖపట్నం, ఉభయగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్షణ మరమ్మతుల నిర్వహణకు 496 బృందాలు..7,394 మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

సీపీడీసీఎల్‌ పరిధిలోనూ సన్నద్ధం

సీపీడీసీఎల్‌ పరిధిలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రభావిత ప్రాంతాల్లో పనుల నిర్వహణకు 285 మంది కాంట్రాక్టర్లను నియమించారు. 2,913 మంది వర్కర్లను సిద్ధంగా ఉంచారు. 

ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో

ఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తీరప్రాంతం వెంట ఉండే సుమారు 26 మండలాల్లో తుపాను ప్రభావం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. 10 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు.

ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా

తుపాను నేపథ్యంలో జెన్‌కో థర్మల్‌ స్టేషన్లలో విద్యుత్‌ ఉత్పత్తికి ఇబ్బంది లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాదవశాత్తు వరద నీరు వస్తే తోడిపోసేందుకు విజయవాడ వీటీపీఎస్‌లో 104 పంప్‌లు సిద్ధంగా ఉంచారు. కడప ఆర్‌టీపీపీలో 20, కృష్ణపట్నంలో 10 మోటార్లు ఏర్పాటు చేశారు. 

యుద్ధప్రాతిపదికన సరఫరా పునరుద్ధరించాలి

విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎస్‌ విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలపై డిస్కంల సీఎండీలు, జెన్‌కో, ట్రాన్స్‌కో అధికారులతో ఆయన సమీక్షించారు.

Tags :
Published : 28 Oct 2025 04:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని