రాజధాని రైతులకు 4 నెలల్లో పెండింగ్‌ ప్లాట్లు: మంత్రి నారాయణ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 30 Oct 2025 05:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి కోసం 29,644 మంది రైతులు ఇప్పటివరకు ఇచ్చిన 34,192.19 ఎకరాలకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. 991 మంది రైతులకు 719.04 ఎకరాలకు ప్లాట్లు ఇంకా కేటాయించాల్సి ఉందని ఆయన అన్నారు. రాబోయే నాలుగు నెలల్లో ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు పూర్తిచేస్తామని వివరించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వంలో 26,197 మంది రైతులకు 31,003.38 ఎకరాలకు ప్లాట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. మంత్రి నారాయణ సచివాలయంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘రైతులకు కేటాయించిన రిటర్నబుల్‌ ప్లాట్లలో ఇప్పటివరకు 26,732 మందికి 60,980 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. ఇంకా 2,501 మంది రైతులకు 8,441 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయాలి. వీటిలో పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు కేసుల్లో 70 మంది రైతులకు చెందిన 312 ప్లాట్లు, భూ సేకరణకు సంబంధించి పెండింగ్‌లో 254 మంది రైతులకు చెందిన 1,170 ప్లాట్లు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇతర వివాదాల్లో మరో 450 మందికి చెందిన 1,889 ప్లాట్లు, పీఓటీ కేసుల్లో 208, దేవాదాయశాఖ వివాదంలో 69, లంక ఎసైన్డ్‌ భూముల్లో 337, ఎన్‌ఆర్‌ఐలవి 444 ప్లాట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 60-90 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.231.03 కోట్ల కౌలు నగదు చెల్లించాం. మరో 484 మందికి రూ.3.15 కోట్లు పెండింగ్‌లో ఉంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకు మొత్తం 319 మందికి రూ.1.03 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించాం. కోర్టు కేసులతోపాటు మృతిచెందిన వారివి వీటిలో ఉన్నాయి.

రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సామాజిక మాధ్యమాల్లో అసత్యప్రచారం చేస్తున్నారు. రైతులు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారు. రైతులు, ప్రజలు వాటిని నమ్మొద్దు’’ అని మంత్రి నారాయణ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు