హమ్మయ్యా.. సంగం బ్యారేజీకి ముప్పు తొలగింది!

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 06:44 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఎగువన ఆనకట్ట వద్ద ఇరుక్కున్న పడవను దూరంగా లాక్కెళ్లిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది

పాత ఆనకట్ట వద్ద ఇరుక్కున్న పడవకు తాళ్లు కడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 

సంగం, న్యూస్‌టుడే: హమ్మయ్యా... బ్యారేజీకి ముప్పు తొలగింది... సంగంలో ప్రతి ఒక్కరి నోటా ఇదే మాట. ఎగువ భాగంలో ఆనకట్ట వద్ద ఇరుక్కున్న 30 టన్నుల బరువైన పడవను బ్యారేజీ వైపు రాకుండా పక్కకు తీసుకెళ్లే పని విజయవంతమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నానది బ్యారేజీ వైపు ఇసుక సేకరించే మూడు పడవలు బుధవారం కొట్టుకొచ్చాయి. వాటిని గుర్తించిన యంత్రాంగం రెండు పడవలను సిబ్బంది సాయంతో నియంత్రించి పక్కకు చేర్చింది. మూడోది బ్యారేజీకి ఎగువన 400 మీటర్ల దూరంలో పాత ఆనకట్ట క్రెస్ట్‌ దగ్గర ఇరుక్కుపోయింది. దానిని పక్కకు తీసుకెళ్లేందుకు రెండోరోజైన గురువారం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, స్థానిక మత్స్యకారులు ప్రయత్నించారు. ఆనకట్ట వద్ద పది అడుగుల నీటి మట్టం ఉండగా... 59,379 క్యూసెక్కుల వరద దిగువకు వెళుతోంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ కమాండెంట్ సుజిత్‌ గోపు ఆధ్వర్యంలో సిబ్బంది.. ముత్తుకూరు మధురానగర్‌కు చెందిన మత్స్యకారులు ప్రవాహంలో ఎదురు ఈదుకుంటూ పడవ వద్దకు వెళ్లి తాళ్లు కట్టారు. జలవనరుల శాఖ, తెలుగుగంగ అధికారులు బ్యారేజీలో 46 నుంచి 79 వరకు గేట్లు మూయించడంతో నీటిమట్టం 14 అడుగులకు పెరిగింది. దీంతో పడవను కదిలించడం సులువైంది. మరొక బోటు సాయంతో తాళ్లను కట్టి లాగుతూ, భారీ పడవను అర కిలోమీటరు ఎగువకు తీసుకెళ్లారు. అక్కడ తాటి చెట్టుకు కట్టేయడంతో ఊపిరి పీల్చుకున్నారు.

తాటి చెట్టుకు కట్టేసిన పడవ

అభినందించిన మంత్రి లోకేశ్‌.. 

తక్షణ స్పందన, సమష్టి కృషి, చిత్తశుద్ధి ఫలితంగా సంగం బ్యారేజీకి ముప్పు తొలగిందంటూ మంత్రి లోకేశ్‌.. జిల్లా కలెక్టర్‌ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్లతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అభినందిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు. సిబ్బంది సమయస్ఫూర్తిని హోంమంత్రి అనిత కొనియాడారు. మత్స్యకార నాయకులు దామోదర్, రామస్వామి వారి బృందాన్ని ఆర్డీవో పావని సత్కరించి అభినందించారు.

Tags :
Published : 31 Oct 2025 05:43 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు