చెరువు నీరు ఇండోసోల్‌కు ఎలా తరలిస్తారు?

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 05:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వండి
నెల్లూరు జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: రోజువారీ అవసరాల కోసం ఉద్దేశించిన తాగునీటి చెరువులలో నీటిని ఇండోసోల్‌ సోలార్‌ ప్రాజెక్టుకు ఎలా తరలిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. చెరువు నీటిని పరిశ్రమల అవసరాల కోసం తరలించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అక్కడ ఏర్పాటుచేస్తున్న భారీ పైపుల ఫొటోలను పరిశీలిస్తే పిటిషనర్ల వాదనల్లో వాస్తవం ఉన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. చేవూరు, చెన్నాయపాలెం గ్రామాలను పరిశీలించాలని శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. అనుమతులు లేకుండా పైప్‌లైన్లు వేస్తున్నట్లు తేలితే.. ఇకమీదట అక్కడ పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ విచారణను నవంబరు 5కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. 

మూగజీవాలు, గ్రామప్రజల రోజువారీ అవసరాలకు ఉద్దేశించిన చెరువుల నుంచి ఇండోసోల్‌ సోలార్‌ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు భారీ పైప్‌లైన్‌ వేస్తున్నారంటూ గుడ్లూరు మండలం చేవూరు, కావలి మండలం చెన్నాయపాలెం గ్రామస్తులు హైకోర్టులో పిల్‌ వేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పరిశ్రమల అవసరాల కోసం చెరువులు, కుంటలు, సరస్సుల నుంచి నీటి తరలింపు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని చెప్పారు. నీటిని తరలించేందుకు పైప్‌లైన్‌ ఏర్పాటు చేస్తున్నారంటూ ఫొటోలను ధర్మాసనం ముందు ఉంచారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పైప్‌లైన్‌ ఎందుకు ఏర్పాటు చేస్తున్నారనే విషయంపై అధికారులతో మాట్లాడి వివరాలను కోర్టు ముందు ఉంచుతానని తెలిపారు. సోమశిల ప్రాజెక్టు నుంచి ఇండోసోల్‌కు నీటిని తీసుకునే ఉద్దేశం ఉందన్నారు. సముద్రపు నీటిని మంచినీటిగా మార్చుకొని వినియోగించే ప్రణాళిక ఉందని చెప్పారు. వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు కొంత సమయం కావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు