ఉపాధి శ్రామికులకు ప్రతిబంధకంగా ఈకేవైసీ నమోదు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 01 Nov 2025 05:40 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

38 లక్షల మందిపై ప్రభావం చూపే అవకాశం
‘లిబ్‌టెక్‌ ఇండియా’ అధ్యయన నివేదిక

ఈనాడు, అమరావతి: ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల మంది ఉపాధిపై ప్రభావం చూపే ఆస్కారముందని ఈ పథకం అమలుపై ఏటా సర్వే చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ‘లిబ్‌టెక్‌ ఇండియా’ పేర్కొంది. గ్రామాల నుంచి వలసలు, సాంకేతిక, మొబైల్‌ నెట్‌వర్క్‌ సమస్యల కారణంగా శ్రామికులు ఈకేవైసీ నమోదు చేయించుకోలేక పోతున్నారని తెలిపింది. ఈకేవైసీ తప్పనిసరి చేయొద్దని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలని సూచించింది. ఏపీలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఉపాధి హామీ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసిన లిబ్‌టెక్‌ ఇండియా.. సంబంధిత వివరాలను శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.

  • గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మూడు జిల్లాలు ఉపాధి పని దినాల వినియోగంలో వెనుకబడ్డాయి. గరిష్ఠంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 44.7%, చిత్తూరులో 31.3%, పల్నాడు జిల్లాలో 0.4% తక్కువ పనిదినాలు వినియోగించారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరులో 4.8%, విశాఖపట్నం జిల్లాలో 4.1% ఎక్కువగా పని దినాలు ఉపయోగించుకున్నారు.
  • జాతీయ స్థాయిలో పరిశీలిస్తే పనిదినాల వాడకంలో ఏపీలో ఈ ఏడాది 13.6% తగ్గుదల ఉంది. కుటుంబాల భాగస్వామ్యం కూడా 42.79 లక్షల నుంచి 40.74 లక్షలకు (-4.8%) తగ్గింది. షెడ్యూల్డ్‌ కులాల్లో 18.7%, షెడ్యూల్డ్‌ తెగల్లో 17%, ఇతరుల్లో 11.3% తగ్గుదల నమోదైంది.
  • శ్రామికుల కనీస వేతనం గతేడాది రూ.300 కాగా, ఈ ఏడాది 307కి పెరిగింది. అయితే, పని దినాల వినియోగం తగ్గినందున శ్రామికులకు వచ్చే వార్షిక ఆదాయం రూ.10,695 నుంచి రూ.10,178కి తగ్గింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు