Montha Cyclone: బలహీనపడిన మొంథా

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 31 Oct 2025 15:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

కావలిలో గరిష్ఠంగా 23.6 సెం.మీ. వర్షం
నేడు ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన
పలు రేవులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరిక


అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం మార్కెట్‌ యార్డులో ఈదురుగాలులకు వాహనంపై పడిపోయిన చెట్టు

ఈనాడు, విశాఖపట్నం: ‘మొంథా’ తీవ్ర తుపాను మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ఈ ప్రక్రియ మంగళవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. తీరం దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజాములోగా తుపానుగా, ఉదయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది. తర్వాత ఇది ఉత్తర-ఆగ్నేయ వాయవ్య దిశగా ఉత్తరాంధ్ర మీదుగా దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వైపు కదులుతూ సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడింది. దీని ప్రభావంతో గురువారం అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.

సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు గురువారం వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. తుపాను తీరం దాటినందున హెచ్చరికల స్థాయిని తగ్గించారు. విశాఖపట్నం, గంగవరం, కళింగపట్నం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురం వద్ద వాగుకు గండి పడి పొలాల్లోకి చేరుతున్న నీరు

10 చోట్ల 20 సెం.మీ. పైగా వర్షం

‘మొంథా’ తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 10 ప్రాంతాల్లో వర్షపాతం 20 సెంటీమీటర్లకు పైగా నమోదైంది. అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో 23.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

బుధవారం ఎన్టీఆర్, పల్నాడు, అల్లూరి సీˆతారామరాజు, బాపట్ల, పల్నాడు, విశాఖపట్నం తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓమోస్తరు వర్షాలు కురిశాయి. సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయిలో 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం అదపాక శివాలయం వైపు పెద్దగెడ్డ వాగును ప్రమాదకరంగా దాటుతున్న వ్యక్తి

Tags :
Published : 30 Oct 2025 04:49 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు