icon icon icon
icon icon icon

హతవిధీ.. ఇదేం మ్యానిఫెస్టో

నెలకు రూ.5 వేలిస్తూ నాలుగున్నరేళ్లు గొడ్డు చాకిరీ చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్‌.. తాజా మ్యానిఫెస్టోలో తమకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుతామని ప్రస్తావించకపోవడంతో వాలంటీర్లు హతాశులయ్యారు.

Updated : 28 Apr 2024 10:55 IST

మా వేతనాల పెంపు ఊసే లేదు
ఉద్యోగ అవకాశాల కల్పనకైనా  భరోసా ఇవ్వరా?
హతాశులైన గ్రామ, వార్డు వాలంటీర్లు

బహిరంగ సమావేశాల్లో వాలంటీర్లు నా సైన్యం.. నా కార్యకర్తలు.. నా మనుషులని జగన్‌ అంటున్నారు. కానీ కనీసం వేతనం పెంచుతానని మ్యానిఫెస్టోలో హామీ కూడా ఇవ్వలేదు. పైగా రాజీనామాలు చేయిస్తున్నారు.

-ఓ వాలంటీర్‌ మండిపాటు


ఎన్డీయే కూటమి వేతనం రూ.10 వేలకు పెంచుతామనే హామీ అయినా ఇచ్చింది. జగన్‌ కనీసం ఆ మాట కూడా చెప్పలేదు. వైకాపా మళ్లీ అధికారంలోకి రాకపోతే మన పరిస్థితేంటి? మనం రాజీనామా చేయకుండా ఉంటే వచ్చే ప్రభుత్వం కొనసాగించే అవకాశం ఉంటుంది.

-వాలంటీర్ల వాట్సప్‌ గ్రూప్‌లో ఓ వాలంటీర్‌ పెట్టిన సందేశం


రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మహిళా వాలంటీర్లు ఏమైనా ప్రచారం చేస్తారా? పోలింగ్‌ ఏజెంట్లుగా కూర్చుంటారా? పేద బతుకులతో ఆడుకోవడం మంచిది కాదు. రాజీనామాలు చేయమనడం అమానవీయం.

-ఓ మహిళా వాలంటీర్‌ ఆవేదన


అసలు రాజీనామా ఎందుకు చేయాలి? వైకాపా కోసం తిరగాల్సిన అవసరమేంటి?  ఒకరేమో వాలంటీర్లు బచ్చాగాళ్లు అంటారు. మరొకరేమో పార్టీ కార్యకర్తలు అంటారు. మేం చెప్పినట్టే పనిచేయాలి అంటారు. వాలంటీర్లు ఏమైనా వైకాపా బానిసలా?

- మరో వాలంటీర్‌ తిరుగుబాటు

ఈనాడు, అమరావతి: నెలకు రూ.5 వేలిస్తూ నాలుగున్నరేళ్లు గొడ్డు చాకిరీ చేయించుకున్న ముఖ్యమంత్రి జగన్‌.. తాజా మ్యానిఫెస్టోలో తమకు ఒక్క రూపాయి కూడా వేతనం పెంచుతామని ప్రస్తావించకపోవడంతో వాలంటీర్లు హతాశులయ్యారు. వాలంటీర్లలో డిగ్రీ, బీటెక్‌, పీజీలు చేసినవారు చాలా మందే ఉన్నారు. మ్యానిఫెస్టోలో తమ వేతన పెంపు గురించి మాట్లాడకపోగా.. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనపై కూడా ఎలాంటి భరోసా లేకపోవడం వారిని మరింత కుంగదీసింది. నెలకు రూ.5 వేలు వేతనమంటే సగటున రోజుకు రూ.165. ఈ మొత్తంతో కుటుంబ పోషణ సాధ్యమవుతుందా? అయినా నాలుగున్నరేళ్లు ఇదే వేతనం చెల్లిస్తూ కాలం గడిపారు. ఉద్యోగులు, ఇతర వర్గాలకు ఐదేళ్ల కాలంలో ఎంతో కొంతయినా జీతం పెరుగుతుంది. తమకు వేతనాలు సరిపోవడం లేదని, ఎంతో కొంత పెంచాలని వాలంటీర్లు ధర్నాలు, నిరసనలు చేసినా జగన్‌ పట్టించుకోలేదు. పైగా స్వచ్ఛంద సేవకులంటూ వారికి కితాబిచ్చారు. ఇప్పుడు మరో ఐదేళ్ల కాలానికి ప్రకటించిన మ్యానిఫెస్టోలోనూ వారి వేతనాల పెంపు గురించి ఎలాంటి హామీ ఇవ్వలేదు. అంటే ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా వేతనాలు పెంచేందుకు ఆయనకు మనసొప్పలేదు. దీనిపై సామాజిక మాధ్యమాల వేదికగా వాలంటీర్లు మండిపడుతున్నారు.

సామాజిక మాధ్యమాల్లో ఆవేదన

మ్యానిఫెస్టోలో వేతనాల ఊసే ఎత్తకపోవడంతో పలువురు వాలంటీర్లు తమ ఆవేదనను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ల ముఖచిత్రాలు ఏమిటో? అని ఒకరు ప్రశ్నిస్తే.. విచారానికి, బాధకు మధ్యలో ఉన్నామంటూ మరొకరు సమాధానమిస్తూ ‘రాజా ది గ్రేట్‌’ సినిమాలోని డైలాగ్‌తో ఆడేసుకుంటున్నారు. మ్యానిఫెస్టో గురించి ఇక మాట్లాడేదేం లేదు బ్రో అని మరికొందరు సోషల్‌ మీడియాలో ఆవేదన వెళ్లగక్కుతున్నారు.  

వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గని మెజారిటీ వాలంటీర్లు

వాలంటీర్లను రాజీనామా చేయించి, పార్టీ ప్రచారానికి తిప్పుకోవాలని వైకాపా నేతలు దాదాపుగా నెల రోజులుగా చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి. బెదిరింపుల దగ్గర నుంచి ప్రలోభాల వరకు అన్ని రకాల అస్త్రాలూ ప్రయోగిస్తున్నా మెజారిటీ వాలంటీర్లు తలొగ్గడం లేదు. ఇన్నాళ్లూ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా వేతనాలిచ్చి.. అదేదో పార్టీ నుంచి ఇచ్చినట్టు ఇప్పుడు పనిచేయాలని చెప్పడంపై చాలా మంది గుర్రుగా ఉన్నారు. చాలామంది ఎందుకు రాజీనామా చేయాలంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలోనూ ఎక్కువ మంది వైకాపా అనుకూల ప్రచారానికి మొగ్గు చూపడం లేదు. కృష్ణా, నెల్లూరు, తదితర జిల్లాల్లో కొందరు రాజీనామా చేసి ఏకంగా తెదేపాలో చేరిపోవడంతో వైకాపా నేతలు కంగు తిన్నారు.  

రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 60 వేల మంది రాజీనామా చేసినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో వైకాపాపై అనుకూలతతో రాజీనామా చేసినవారు 5 శాతం మించి ఉండరు.

రూ.10 వేలకు పెంచుతామన్న కూటమి హామీతో భరోసా  

పెరిగిన ధరలకు రూ.5 వేల వేతనం సరిపోవడం లేదని, పెంచాలని వాలంటీర్లు ఏడాది క్రితం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. కొందరు వైకాపా నేతలు వారిని తూలనాడారు. వారి తీరు చాలా మంది వాలంటీర్లకు నచ్చకపోయినా ఏ ఉద్యోగమూ దక్కని పరిస్థితుల్లో కుటుంబ పోషణకు రూ.5 వేలు ఎంతో కొంత ఉపయోగపడుతుందని కొనసాగారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతోపాటు వారి వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని తెదేపా హామీ ఇచ్చింది. ఇది చాలా మందికి భరోసానిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం