icon icon icon
icon icon icon

YS Sharmila: కంటతడి పెట్టిన షర్మిల.. జగన్‌కు కౌంటర్‌

ఏపీ పీసీసీ అధ్యక్షరాలు వైఎస్‌ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. మీడియా సమావేశంలో ఆమె తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు.

Updated : 11 May 2024 17:29 IST

కడప: తాను అడిగిన ప్రశ్నలకు సీఎం జగన్‌ సూటిగా సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి  షర్మిల (YS sharmila) డిమాండ్‌ చేశారు. కడపలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. ‘రాజకీయ కాంక్షతోనే కడపలో పోటీ చేస్తున్నానని జగన్‌ అంటున్నారు. నన్ను రాజకీయాల్లోకి  తెచ్చింది జగనన్న కాదా? జైల్లో ఉన్నప్పుడు నన్ను పాదయాత్ర చేయమన్నది మీరు కాదా? నా భర్త, పిల్లల్ని వదిలేసి వేల కి.మీల మేర పాదయాత్ర చేశా. మీ భవిష్యత్‌ కోసం నా కాలికి గాయమైనా వెనక్కి తగ్గలేదు. పాదయాత్ర సమయంలో వైకాపా అంతా నా చుట్టే తిరిగింది. నాకే రాజకీయ కాంక్ష ఉంటే వైకాపాను నేను హైజాక్‌ చేసేదాన్ని కాదా? మీ నుంచి పైసా సాయం కోరినట్టయినా నిరూపించగలరా? మీరు వైఎస్‌ఆర్‌ కొడుకునని ఎందుకు మర్చిపోతున్నారు? ప్రపంచంలో రాజకీయ విభేదాలు ఉన్నవాళ్లు చాలా మంది ఒకే కుటుంబంలో ఉన్నారు. వేర్వేరు పార్టీల్లో ఉండి ఒకే కుటుంబంలో కొనసాగుతున్నవారు చాలా మంది ఉన్నారు’’ అని షర్మిల ఇటీవల జగన్‌ ఇంటర్వ్యూల్లో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు.

నాది రాజకీయ కాంక్షా.. ప్రమాణం చేసి చెప్పగలరా?

‘‘ఆనాడు ప్రతి సభలో, ప్రతి అడుగులో జగన్‌ కోసం కాలికి బలపం కట్టుకొని నేను తిరగలేదా? ఇన్ని త్యాగాలు చేసినా నాకు రాజకీయ కాంక్ష ఉందంటున్నారే.. అదే ఉంటే నేను కోరుకున్న పదవి మీ పార్టీలో మొండిగానైనా పొందగలను. నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్ష గానీ ఉందని మీ మనస్సాక్షిలో మీరు నిజంగానే నమ్ముతున్నారా? మీరు సీఎం అయ్యేంత వరకు అన్న కోసమని, రాజశేఖర్‌ రెడ్డి చేసిన సంక్షేమ పాలన మీరు మళ్లీ తీసుకొస్తారని నమ్మి నేను మీకోసం ఎంతో చేసిన విషయం వాస్తవం కాదా? మనిద్దరం నమ్మే బైబిల్‌ మీద ఒట్టేసి నేను చెప్పగలను.. నాకు రాజకీయ కాంక్ష గానీ, డబ్బు కాంక్షగానీ, మిమ్మల్ని పదవి అడగకుండా మీ కోసం నిస్వార్థంగా పనిచేశానని నేను ప్రమాణం చేయగలను. పదవి అడిగానని మీరు అదే బైబిల్‌పై ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉందని, డబ్బు కాంక్ష ఉందని గానీ రుజువు చేయగలరా? అసలు మనిషిని, మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర్‌ రెడ్డి నుంచి మీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు వైఎస్‌ఆర్‌. అలాంటి వ్యక్తి బిడ్డని నేను. ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన మాటలు వింటూ హృదయంలో హృదయంలా పెరిగాను. ఆయన ఆశయాల కోసం ఆ రకంగానే మీకు సహాయపడాలని నేను నిస్వార్థంగా త్యాగం చేశా’’ అంటూ షర్మిల కన్నీరు పెట్టుకున్నారు. 

ఆ మాత్రం ఇంగితం లేకుండా నాపై దుష్ప్రచారమా?

‘‘జగన్‌ సోషల్‌ మీడియా ద్వారా నాపై దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారు. రాజన్న బిడ్డనన్న ఇంగితం లేకుండా నాపై, నా పుట్టుకపై రాక్షస సైన్యంతో ప్రచారం చేయిస్తున్నారు. నాపై వికృతంగా ప్రచారం చేయించినందుకు జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు. మీ కోసం త్యాగం చేసిన చెల్లిని గౌరవించకపోగా మానసికంగా హింసిస్తారా?జగన్‌కు చంద్రబాబు పిచ్చిపట్టుకుంది.. అందుకే భ్రమల్లో బతుకుతున్నారు. జగన్‌ మానసిక పరిస్థితిపై నాకు నిజంగానే ఆందోళన ఉంది. మాట మాట్లాడితే నేను, సునీత చంద్రబాబు చేతిలో రిమోట్‌ కంట్రోల్‌ అని, ఆయన చెప్పినట్లు చేస్తున్నామని అంటున్నారు. జగన్‌వి అన్నీ ఊహజనితమైన ఆరోపణలు. మేం చంద్రబాబు చేతిలో రిమోట్‌ కంట్రోల్‌ అనడంలో అర్థంలేదు. ఆయనకు అందరూ కీలు బొమ్మల్లాగే కనిపిస్తారు. మీకు ఎలా వీలైతే అలా మాట్లాడతారా? వివేకా హత్య విషయంలో తొలుత సీబీఐ విచారణ అడిగారు. సీఎం అయ్యాక వద్దన్నారు. ఇదేనా మీకున్న విలువ? అవసరానికి మాట మారుస్తారా? మీకు విలువ అనేది ఉంటే.. వైఎస్‌ఆర్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో పెట్టించిన వాళ్లకు ఎలా పదవులు ఇస్తారు?’’ అని ప్రశ్నించారు.

దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా?

‘‘మీ పేపర్‌లో వైఎస్‌ఆర్‌ ఫొటో.. కింద వివేకాపై తప్పుడు ప్రచారం.. ఇదేనా మీ విలువ? సొంత బాబాయి మీద తప్పుడు ప్రచారం చేస్తారు. ఇదేనా మీకున్న విశ్వసనీయత? మీకు విలువ ఉంటే అవినాష్ రెడ్డి మీద అనుమానం ఎందుకు రాలేదు ? అవినాష్ రెడ్డి నిర్దోషి అని నాలుగు ఇంటర్వ్యూల్లో చెబితే చూసి మీరు కన్విన్స్ అయ్యారా? అలా కన్విన్స్‌ అవ్వడానికి మీరెవరు? రాజ్యాంగమా? చట్టమా? కన్విన్స్ అవ్వాల్సింది న్యాయ వ్యవస్థ. సీబీఐ వద్ద ఆధారాలు ఉన్నాయి.. నిర్దోషులైతే సీబీఐకి ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారు? దొంగ ఎప్పుడైనా దొంగనని చెబుతాడా? దొంగ మాటలు పిచ్చోళ్లు నమ్ముతారు. మీకు విశ్వసనీయత ఉంటే.. ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు ? పోలవరం ఎందుకు కట్టలేదు ? కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఎందుకు కట్టలేదు? కడపలో 620 గ్రామాలకు కనీసం త్రాగునీరు లేదెందుకు? వైఎస్‌ఆర్‌ తర్వాత ఒక్క ఎకరాకు సాగు నీరు ఇవ్వలేదు’’ అని షర్మిల జగన్‌ను నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img