Bopparaju Venkateswarlu: కేవలం ఉద్యోగులకే రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా?: బొప్పరాజు వెంకటేశ్వర్లు

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని.. సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు(Bopparaju Venkateswarlu) విమర్శించారు. కేవలం ఉద్యోగులకే రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.

Updated : 08 Apr 2023 15:06 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని.. సమయానికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఏపీ ఐకాస అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) విమర్శించారు. ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం నాలుగు స్తంభాలాట ఆడుతోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేవలం ఉద్యోగులకే రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. వాలంటీర్లు, సలహాదారుల కోసం రూ. 20 వేల కోట్లను ఖర్చు చేస్తున్న మాటను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. సర్వీసు రూల్స్‌ కూడా సరిగా అమలు చేయడం లేదని.. పొరుగు రాష్ట్రాల్లో ఉద్యోగుల పరిస్థితి బాగుందని వ్యాఖ్యానించారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలు, పెన్షన్లు, 11వ పీఆర్సీ వేతన స్కేలు అమలు, పీఆర్సీ అరియర్స్‌, పెండింగ్‌ డీఏలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.

సమస్యల పరిష్కారానికి ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని కూడళ్లలో మలివిడత పోరాటానికి దిగింది. నల్ల కండువాలు, ప్లకార్డులతో విజయవాడలో ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పేస్కేలు దగ్గర నుంచి డీఏ అరియర్స్‌, పీఆర్సీ, చివరికి జీతాలు ఇవ్వమంటే అవహేళన చేసే పరిస్థితి వరకు.. అన్ని అంశాలను నాలుగేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించట్లేదు. పరిష్కారం సంగతి దేవుడెరుగు కనీసం లెక్కలు చెప్పండయ్యా అంటే.. మేం ఉద్యమం మొదలు పెట్టిన తర్వాత డబ్బులు ఇచ్చామంటున్నారు. ఎంత ఇచ్చారని అడిగితే దానికి సమాధానం చెప్పట్లేదు. అందుకనే ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించాం’’ అని తెలిపారు.

నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు..

రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉద్యోగులను కించపరిచే విధంగా మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారు. ఒకరేమో ఎప్పుడైతే ఏంటి జీతం ఇస్తున్నాం కదా అంటారు. మరొకరేమో రూ.90 వేల కోట్లు మొత్తం ఉద్యోగుల కోసమే ధారపోస్తున్నామంటారు. ఇలా ఏ చర్చల్లోనైనా మేం ఇవ్వాల్సింది ఇస్తాం. చెప్పాల్సింది చెప్పేసి వెళ్లిపోతాం అనే ధోరణితో మాట్లాడుతున్నారు తప్ప సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఉద్యోగుల సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. మలిదశ ఉద్యమంలో భాగంగా పోస్టర్ల విడుదలతో మొదలై సమీప భవిష్యత్తులో ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుంది. ప్రభుత్వ యాప్‌ వినియోగాన్ని నిలిపి వేస్తూ సెల్ ఫోన్ డౌన్ చేస్తాం’’ అని బొప్పరాజు తేల్చి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని