Nagarjuna Sagar: సాగర్‌ వద్ద కొనసాగుతున్న పహారా.. ఏపీ పోలీసులపై కేసు నమోదు

నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

Updated : 01 Dec 2023 12:36 IST

నాగార్జునసాగర్‌: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్‌ డ్యామ్‌పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఏపీ వైపు భారీగా పోలీసులు మోహరించారు. ఆ రాష్ట్రానికి చెందిన సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కృష్ణా బోర్డు అధికారులు సాగర్‌ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

తెలంగాణ సీఎం కార్యాలయ అధికారిణి స్మితా సభర్వాల్‌, నీటి పారుదలశాఖ అధికారులు శుక్రవారం అక్కడికి చేరుకుని సమీక్షించనున్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఐజీ స్థాయి అధికారులు పరిస్థితిని అంచనా వేసే అవకాశముంది. గత రెండు రోజులుగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి సాగర్‌ వద్దే మకాం వేశారు. ఇప్పటికే సుమారు 4వేల క్యూసెక్కుల నీటిని ఏపీ విడుదల చేసుకుంది. ప్రస్తుతం సాగర్‌లో 522 అడుగుల నీటిమట్టం ఉండగా.. మరో 12 అడుగులకు చేరితే డెడ్‌ స్టోరేజీకి చేరే అవకాశముంది.

ఇప్పుడే ఎందుకీ దండయాత్ర?

తెలంగాణ అధికారుల ఫిర్యాదు

మరోవైపు ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది. అనుమతి లేకుండా డ్యామ్‌పైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ తెలంగాణ ఎస్పీఎఫ్‌ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారనని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ పోలీసులు, ఆ రాష్ట్ర నీటి పారుదలశాఖ అధికారులపై నాగార్జునసాగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.   

అసలేంటీ వివాదం?

రాష్ట్ర విభజన సమయంలో కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ సమయంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయం వెలువడింది. ఈ నిర్ణయం సరిగా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి. 

కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీళ్లు కూడా తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. గతంలో కృష్ణా బోర్డు ఆదేశాలు ఇచ్చినా నీళ్లు విడుదల చేయని సందర్భాలు ఉండేవి. తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్‌ కుడికాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ఇండెంటు పంపిన దాఖలాలూ లేవు. నీటి విడుదలకు ఈ రెండు నెలల్లో ఎలాంటి ఇబ్బందులూ రాలేదు. ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్‌ డిమాండు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని