Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 31 May 2024 12:59 IST

1. కౌంటింగ్‌ ఏజెంట్లపై వ్యాఖ్యలు.. సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు

వైకాపా ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)పై క్రిమినల్ కేసు నమోదైంది. కౌంటింగ్‌ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో తెదేపా నేతలు దేవినేని ఉమా, గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. 153, 505, 125 సెక్షన్ల కింద సజ్జలపై కేసు పెట్టారు. పూర్తి కథనం

2. బెంగళూరులో దిగిన ప్రజ్వల్‌ రేవణ్ణ.. అరెస్టు చేసిన సిట్‌ పోలీసులు

పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్‌ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna)ను బెంగళూరు (Bengaluru) పోలీసులు గురువారం అర్ధరాత్రి దాటాక అరెస్టు చేశారు. జర్మనీ నుంచి బయలుదేరిన ఆయన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పూర్తి కథనం

3. ఏబీవీని సర్వీసులోకి తీసుకోవాలి.. ఏపీ సీఎస్‌ ఆదేశాలు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara rao)ను సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఎత్తివేసింది.పూర్తి కథనం

4. 24 గంటలపాటు ఆలస్యం.. విమానంలో స్పృహ తప్పిన ప్రయాణికులు

మండు వేసవిలో ఎయిరిండియా ప్రయాణికులు అవస్థలు పడ్డారు. విమానం ఆలస్యం (Flight Delay) కారణంగా గంటల తరబడి అందులోనే కూర్చోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏసీ కూడా వేయకపోవడంతో వారంతా ఇబ్బందులకు గురయ్యారు. కొందరైతే స్పృహతప్పి పడిపోయారు. దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం (Delhi Airport)లో ఈ ఘటన చోటుచేసుకుంది.పూర్తి కథనం

5. ఏసీబీ వలలో మరో నీటిపారుదల శాఖ అధికారి.. 4 గంటలు శ్రమించి అదుపులోకి..

నీటిపారుదల శాఖలో నలుగురు అధికారులు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కు పట్టుబడ్డారు. ఓ దస్త్రం ఆమోదానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రంగారెడ్డి జిల్లా ఈఈ భన్సీలాల్, ఏఈలు కార్తీక్, నిఖేశ్‌లను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పూర్తి కథనం

6. 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ.. ద్రవమే ఆహారం!

తమిళనాడులోని కన్యాకుమారిలో వెలసిన స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. పూర్తి కథనం

7. ట్రంప్‌నకు మద్దతుగా వివేక్‌ రామస్వామి..!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతుగా ఇండో-అమెరికన్‌ నేత వివేక్‌ రామస్వామి గళం విప్పారు. ట్రంప్‌ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీసుకొన్న నిర్ణయం కచ్చితంగా బెడిసి కొడుతుందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన  సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.పూర్తి కథనం

8. 90 సెకన్లలో 29 పదాలు.. అమెరికా ‘స్పెల్లింగ్‌ బీ’ విజేతగా తెలుగు సంతతి బాలుడు

అగ్రరాజ్యం అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జాతీయ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో (US Spelling Bee) ఈ ఏడాది కూడా భారత అమెరికన్‌ విద్యార్థుల (Indian - American students) హవా కొనసాగింది. 2024 స్క్రిప్స్‌ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన 12 ఏళ్ల బృహత్‌ సోమ (Bruhat Soma) విజేతగా నిలిచాడు.పూర్తి కథనం

9. రైళ్ల రద్దీ.. అమితాబ్‌ సహాయం కోరిన కాంగ్రెస్‌

ప్రజా సమస్యలను కేంద్రం వద్ద లేవనెత్తేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan ) పేరును ప్రస్తావించి ప్రజల ఇక్కట్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇంతకీ విషయం ఏంటంటే..?పూర్తి కథనం

10. ‘మా దేశంలో నెపోటిజం స్థాయి ఇదీ’.. పాక్‌ క్రికెటర్ ఎంపికపై ఫ్యాన్స్ ఫైర్

పాకిస్థాన్‌ వికెట్ కీపర్‌ అజామ్‌ ఖాన్‌పై ఆ దేశ అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. టీ20 ప్రపంచ కప్‌ ముంగిట.. ఇంగ్లాండ్‌తో ఇటీవల ముగిసిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఐదు బంతులను ఎదుర్కొని డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు