Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 07 Mar 2023 20:58 IST

1. లోపాలు చెప్పడమే కాదు.. పాజిటివ్‌ న్యూస్‌కు ప్రాధాన్యం ఇవ్వండి: కేటీఆర్‌

ఉమెన్స్‌ డే సందర్భంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టులకు అవార్డుల ప్రదానం చేశారు. కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, సబితా ఇంద్రారెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘మీరు మంచి పనిచేస్తే ఎవరూ పొగడరు. కానీ, చిన్న తప్పు చేసినా బాధ్యత వహించాల్సి ఉంటుంది. సమాజంలో మా పరిస్థితి కూడా అంతే. ఎంత మంచి చేసినా ఎవరూ గుర్తించరు కానీ.. తప్పులు అందరూ గుర్తిస్తారు.’’ అని అన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2.  అరుణ్‌ పిళ్లై ఎమ్మెల్సీ కవితకు బినామీ.. రిమాండ్ రిపోర్టులో ఈడీ

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన అరుణ్‌ పిళ్లై 17 పేజీల రిమాండ్‌ రిపోర్డులో ఈడీ కీలక విషయాలు వెల్లడించింది. ఎమ్మెల్సీ కవితకు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో అరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించాడని పేర్కొంది.‘‘సౌత్‌ గ్రూప్‌లో ఎమ్మెల్సీ కవిత, అరబిందో ఫార్మా ప్రమోటర్‌ శరత్‌రెడ్డితోపాటు వైకాపా ఎంపీ మాగుంట కుమారుడు రాఘవ ఉన్నారు. సౌత్‌గ్రూప్‌ ప్రతినిధులుగా అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌, బుచ్చిబాబు ఉన్నారు. కవితకు లబ్ధి కోసం ఆరుణ్‌ పిళ్లై అన్నీ తానై వ్యవహరించారు.  అప్‌ నేతలు, సౌత్‌ గ్రూప్‌ వ్యక్తులకు మధ్య పిళ్లై సయోధ్య కుదిర్చారు.’’ అని ఈడీ పేర్కొంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3.రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైళ్ల పొడిగింపును అడ్డుకుంది: కిషన్‌రెడ్డి

కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు భారాసకు లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే  లేఖలు రాసినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నిచారు. సీఎం కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి 12 అంశాలపై లేఖాస్త్రాలు సంధించారు. యాదాద్రి వరకు రెండో దశ ఎంఎంటీఎస్‌ పనులకు సహకరించాలని, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు విస్తరణ పనులు ప్రారంభించాలని కోరారు. సైనిక స్కూల్‌, సైన్స్‌ సిటీ కోసం భూమి కేటాయించాలని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజ్ఞప్తి చేశారు. రైల్వేల పురోగతికి సహకరించాలని లేఖలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. 19మంది చిన్నారులు మృతి.. బెంగాల్‌లో వైద్య సిబ్బందికి సెలవులు రద్దు

 శ్వాస సంబంధిత సమస్యలతో చిన్నారుల మరణాల సంఖ్య పెరుగుతుండటంతో పశ్చిమ బెంగాల్‌(West bengal) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది సెలవులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల తరుణంలో సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని.. ఫీవర్‌ క్లినిక్‌లు నిరంతరం (24*7)  పనిచేయాలని ఆరోగ్య శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. మరోవైపు, ఇదే అంశంపై సీఎం మమతా బెనర్జీ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆక్యూట్‌ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌(ARI)మూలంగా ఇప్పటివరకు 19మంది చిన్నారులు మృతిచెందారని.. వీరిలో ఆరుగురు ఎడినో వైరస్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. నా తండ్రికి ఏదైనా జరిగితే.. ఎవర్నీ వదలను..!

రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) సీబీఐ(CBI) విచారణను ఎదుర్కొంటున్నారు. మంగళవారం దర్యాప్తు సంస్థ ఆయన్ను ప్రశ్నించింది. దీనిపై లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని నిరంతరం వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే ఎవర్నీ వదలనని హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ఆ విద్యుత్‌ కొనాల్సిందే

 దేశంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే థర్మల్‌ ప్లాంట్లకు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కొత్తగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే  అందులో 40 శాతం వాటాకు సమానమైన పునరుత్పాదక విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. లేదంటే అంతమొత్తానికి సమానమైన విద్యుత్‌ కొనుగోలు చేయాలని పేర్కొంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే పవర్‌ ప్లాంట్లకు ఈ నిబంధన తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ 2003లోని టారిఫ్‌ పాలసీ 2016ని ఇంధన మంత్రిత్వ శాఖ సవరించింది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. శాసన మండలికి ఎమ్మెల్యే కోటా భారాస అభ్యర్థులు వీరే!

తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్‌, కుర్మయ్యగారి  నవీన్‌ కుమార్‌, చల్లా వెంకట్రామిరెడ్డిని భారాస ఎంపిక చేసింది. ఎల్లుండి ఉదయం 11 గంటలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్‌ వేయనున్నారు. నామినేషన్ ఏర్పాట్లు చూడాలని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, భారాస ప్రదాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.  గవర్నర్‌ కోటాలో ఇద్దరు అభ్యర్థులను ఎల్లుండి కేబినెట్‌ సమావేశంలో ఖరారు చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. టీఎస్‌సెట్‌ పరీక్ష తేదీ రీషెడ్యూల్‌.. కొత్త తేదీ ఇదే..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్‌ సెట్‌)-2022  తేదీలను రీషెడ్యూల్‌ చేశారు. దీని ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న (శుక్రవారం) నిర్వహించాలని నిర్ణయించారు.  14, 15 తేదీలలో జరగాల్సిన పరీక్షలను మాత్రం ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారమే నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు టీఎస్‌ సెట్‌ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్‌ సి.మురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు, రీషెడ్యూల్‌ చేసిన ఈ పరీక్షకు సంబంధించిన హాల్‌టిక్కెట్లను మార్చి 10 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. వాయుసేన చరిత్రలో తొలిసారి.. యుద్ధక్షేత్రంలోకి మహిళ..!

మహిళా దినోత్సవం వేళ.. భారత వైమానిక దళం(IAF) ఓ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళలు నేరుగా యుద్ధక్షేత్రంలో విధులు నిర్వర్తించే అవకాశాన్ని ఇచ్చింది. ఈ మేరకు గ్రూప్‌ కెప్టెన్ షాలిజా ధామి(Shaliza Dhami)కి పశ్చిమ సెక్టార్‌లోని ఫ్రంట్‌లైన్‌ కాంబాట్ యూనిట్‌లో కమాండ్ బాధ్యతలు అప్పగించింది. రణరంగంలో నాయకత్వ బాధ్యతను మహిళకు అప్పగించడం ఇదే తొలిసారి. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10.  సిసోదియాను అరెస్టు చేశారు సరే.. నోట్ల గుట్టలు దొరికిన ఎమ్మెల్యే సంగతేంటి?

మద్యం కుంభకోణం (Excise Scam Case) కేసులో మనీశ్‌ సిసోదియా (Manish Sisodia) అరెస్టు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్న దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ (Arvind Kejriwal)‌.. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సూటి ప్రశ్న వేశారు. కర్ణాటక (Karnataka)లో భాజపా ఎమ్మెల్యే కుమారుడి ‘లంచావతరం’ ఘటనను ఉదహరిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏమీ లేని సిసోదియాపై అన్ని కేసులు పెట్టినప్పుడు.. నోట్ల గుట్టలు దొరికిన భాజపా ఎమ్మెల్యేను అరెస్టు చేయలేదేం? అని ప్రశ్నించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని